Adluri Lakshman: స్వేచ్ఛ బ్యూరో: గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాసంస్థల విద్యార్థులకు సదుపాయాల కల్పన కోసం చేపట్టిన కొనుగోలు ప్రక్రియపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష నాయకుడు హరీశ్ రావు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు.
దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజం
దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ నేతల నైజమని, ప్రజాధనంతో ఫాంహౌస్ లు కట్టుకుని విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మొత్తం టెండర్ విలువ రూ.687.78 కోట్లు మాత్రమేనని, మరి రూ.2,000 కోట్ల కుంభకోణమనే అంకె ఎక్కడి నుంచి వచ్చిందో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని, ఆధారాలు ఉంటే విచారణ సంస్థలకు ఇవ్వాలని, లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని ఫైరయ్యారు. ఈ టెండర్ ప్రక్రియ పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా, జాతీయ స్థాయి పోటీ టెండర్ల ద్వారా నిర్వహించిందన్నారు.
గుజరాత్ కాంట్రాక్టర్ కథ ఏంటి..?
దేశవ్యాప్తంగా 27 బిడ్లు వచ్చాయని, టెక్నికల్ అర్హతలు, ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఎల్ 1 విధానంలో టెండర్లు ఖరారు చేసినట్లు మంత్రి అడ్లూరి వివరించారు. ఏ ఒక్క సంస్థకూ నామినేషన్ పద్ధతిలో పని ఇవ్వలేదన్నారు. గుజరాత్ కాంట్రాక్టర్ కథలు పూర్తిగా కల్పితమని హరీశ్ రావుపై ధ్వజమెత్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంస్థలు పోటీ పడి టెండర్లు దక్కించుకున్నాయని, దక్కించున్న వాటిలో గుజరాత్ కంపెనీ అసలే లేదన్నారు. హైకోర్టు సైతం కేంద్రీకృత కొనుగోలు విధానంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు.
మంత్రి వివరణ
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లిడ్ క్యాప్ కు కేవలం రూ.40.21 లక్షల విలువైన పనులు మాత్రమే ఇచ్చారని, కానీ తమ ప్రభుత్వం కేవలం రెండేళ్లలో రూ.51 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ ను లిడ్ క్యాప్ కు ఇచ్చిందన్నారు. టై, బెల్టులు, ఐడీ కార్డుల మొత్తం ఆర్డర్ను టీజీఎల్ఐపీసీకి అప్పగించామని, యూనిఫాం వస్త్రం, కార్పెట్లు, దుప్పట్లు, బెడ్డింగ్ సామగ్రిలో గణనీయమైన వాటాను టీజీఎస్ సీవోకు కేటాయించాంమన్నారు. నోటుబుక్ల సరఫరాను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్కు అప్పగించామని మంత్రి అడ్లూరి వివరించారు. 14 వేల మంది మహిళా టైలర్లకు యూనిఫాం కుట్టు పనులు కల్పించి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు.
బీఆర్ఎస్ నేతలకు మంత్రి సూటి ప్రశ్న
27 లక్షల మంది విద్యార్థులకు తొలిసారి సమగ్ర సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఎన్ని కొత్త హాస్టళ్లు నిర్మించారో సమాధానం చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. డైట్ ఛార్జీలు ఎందుకు పెంచలేదని నిలదీశారు. అక్రమాలు జరిగాయని చెబుతున్నట్లయితే ఆధారాలు బయటపెట్టాలని, లేకపోతే ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: నేపాల్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు, ఎనిమిది మంది మృతి!