మన దేశంలో శిశువులకు మసాజ్ చేయడం చాలా కాలంగా వస్తున్న సంప్రదాయం. సరైన పద్ధతిలో మసాజ్ చేస్తే శిశువులు ప్రశాంతంగా ఉంటారు. మసాజ్ చేస్తే పిల్లలకు బాగా నిద్ర కూడా పడుతుంది. అలాగే తల్లిదండ్రులు, బిడ్డ మధ్య అనుబంధం మరింత బలపరుస్తుంది. అయితే వేసవిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే శిశువుకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది.
చాలామంది ఎక్కువ నూనె రాస్తే మంచిదని భావిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కువ నూనె వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో చెమట, దద్దుర్లు, చర్మ చికాకులు పెరగవచ్చు. కాబట్టి తక్కువ పరిమాణంలో మాత్రమే నూనె ఉపయోగించడం మంచిది.
కొంతమంది రోజులో పలుమార్లు మసాజ్ చేస్తుంటారు. వేసవిలో ఇలా చేయడం వల్ల శిశువుకు అసౌకర్యం కలగవచ్చు. సాధారణంగా రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మసాజ్ చేస్తే సరిపోతుంది. స్నానం చేసే ముందు మసాజ్ చేస్తే అదనపు నూనె తొలగిపోతుంది. దీంతో చర్మ సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.
నేరుగా ఎండలో శిశువుకు మసాజ్ చేయడం మంచిది కాదు. చాలా వేడిగా ఉండే గదుల్లో కూడా మసాజ్ చేయకూడదు. అలాంటి వాతావరణంలో పిల్లలు అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. చల్లగా, గాలి బాగా వచ్చే గదిని ఎంచుకోవడం బెస్ట్.
శిశువుల చర్మం, కండరాలు చాలా సున్నితంగా ఉంటాయి. గట్టిగా మసాజ్ చేస్తే బిడ్డ ఏడవడం లేదా పిల్లలకు అసౌకర్యంగా అనిపిస్తుంది. అందుకే చాలా మెల్లగా, సున్నితమైన చేతి కదలికలతో మసాజ్ చేయాలి.
Also Read: గర్భంలో బిడ్డ 24 గంటలు ఏం చేస్తుంటాడు.. ఎంతసేపు నిద్రపోతాడు, ఎప్పుడు మెళుకువగా ఉంటాడు?
హెవీగా, జిడ్డుగా ఉండే నూనెలు వేసవిలో చికాకు కలిగిస్తాయి. అందుకే వేసవి సీజన్లో మసాజ్ చేయడానికి ఇవి సరైనవి కావు. వీటిని ఉపయోగిస్తే చర్మంలో వేడి, చెమట చికాకు ఎక్కువగా కలిగిస్తాయి. తేలికగా ఉండే కొబ్బరి నూనె లేదా బాదం నూనెను తక్కువ పరిమాణంలో ఉపయోగించడం మంచిదని నిపుణుల అభిప్రాయం.
సున్నితంగా చేసే మసాజ్ వల్ల శిశువు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు నిద్ర కూడా బాగా పడుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ బిడ్డ సౌకర్యం, భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి శిశువు చర్మం వేర్వేరుగా స్పందించవచ్చు. కొత్త నూనె ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సరైన పద్ధతిలో చేసే మసాజ్ శిశువు ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, తల్లి బిడ్డ అనుబంధానికి తోడ్పడుతుంది.