Nizamabad Polling Centre: నిజామాబాద్ జిల్లాలోని ధర్మారం పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన వాగ్వాదం వివాదంగా మారి, పోలీసుల జోక్యంతో లాఠీచార్జ్ వరకూ వెళ్లడం కలకలం రేపింది.
స్థానిక సమాచారం ప్రకారం, పోలింగ్ కేంద్రంలో సాయిబాబా అనే అభ్యర్థి అక్రమాలకు పాల్పడుతున్నాడని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. పోలింగ్ సెంటర్ లోపలే రిగ్గింగ్ చేస్తున్నాడని, ఓటర్లను ప్రభావితం చేస్తూ ప్రచారం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని నిరసిస్తూ ప్రత్యర్థి అభ్యర్థి వాసు వర్గం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వాసు వర్గానికి చెందిన అనుచరులు పెద్ద సంఖ్యలో పోలింగ్ సెంటర్ లోపలికి దూసుకొచ్చారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటల దాడి కాస్తా తోపులాటకు దారి తీసింది. పోలింగ్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, గందరగోళం మరింత పెరిగింది.
సాయిబాబా అభ్యర్థి గత రెండు గంటలుగా పోలింగ్ సెంటర్ లోపలే ఉండి ప్రచారం చేస్తున్నాడని, ఓటర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి చేయి దాటుతోందని భావించిన పోలీసులు చివరకు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
లాఠీచార్జ్ అనంతరం పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతంలో.. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి, ఎవరినీ అనవసరంగా పోలింగ్ కేంద్రం సమీపానికి అనుమతించకుండా ఆంక్షలు విధించారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కొంతసేపు నిలిచిపోయిన పోలింగ్ను పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రారంభించారు.
Also Read: ఢిల్లీకి తరలివెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు.. ఓట్ చోరీపై ఏఐసీసీ మహాధర్నా వ్యూహం
ఈ ఘటనపై ఎన్నికల అధికారులు స్పందిస్తూ, పోలింగ్ కేంద్రంలో జరిగిన వివాదంపై విచారణ చేపడతామని తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలు, పోలింగ్ సెంటర్లో ప్రచారం అంశాలపై సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు.