Uttam Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం – నల్లమల సాగర్ (గోదావరి – పెన్నా) లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతరావుకు శనివారం ఒక లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) నుంచి ఎలాంటి అనుమతులు మంజూరు చేయవద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి జలాల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు, అంతర్రాష్ట్ర ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తెరపైకి తెస్తోందని ఉత్తమ్ లేఖలో ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి, పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద ప్రతిపాదిత నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలించి, అక్కడి నుంచి పెన్నా బేసిన్కు నీటిని మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వివరించారు. గోదావరిలో మిగులు జలాలు లేనప్పుడు, ఇలా ఇతర బేసిన్లకు నీటిని తరలించడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకే నీటి కొరత ఉందని, ఈ సమయంలో కొత్తగా లింక్ ప్రాజెక్టులు చేపట్టడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (GRMB) అనుమతి గానీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి గానీ తీసుకోలేదని మంత్రి గుర్తుచేశారు. అందువల్ల ఈ ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించవద్దని, ఎలాంటి సాంకేతిక, పర్యావరణ, ఆర్థిక అనుమతులు ఇవ్వకుండా సీడబ్ల్యూసీని ఆదేశించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో కేంద్రాన్ని కోరారు.
తెలంగాణలో ధాన్యం సేకరణ, నిల్వ సామర్థ్యం మరియు పెండింగ్లో ఉన్న సబ్సిడీ బకాయిల విడుదలకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు. గురువారం (డిసెంబర్ 12) రాసిన ఈ లేఖలో, ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (KMS) 2025-26 కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఏడు కీలక అంశాలను పరిష్కరించాలని ఆయన కోరారు.
ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి కేంద్రం నిర్ణయించిన 36 లక్షల మెట్రిక్ టన్నుల (LMT) బియ్యం సేకరణ లక్ష్యం సరిపోదని, రాష్ట్రంలో వరి ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున ఈ లక్ష్యాన్ని 80 LMTల ధాన్యం (54 LMT బియ్యం) వరకు పెంచాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, రబీ 2024-25 సీజన్కు సంబంధించి అదనంగా 10 LMTల బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని కేటాయించాలని కోరారు. ఖరీఫ్ 2024-25 సీఎంఆర్ (CMR) డెలివరీ గడువును 2026 జనవరి 31 వరకు పొడిగించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో గోదాముల్లో నిల్వ ఉన్న బాయిల్డ్ రైస్ను తరలించేందుకు సరిపడా రైల్వే రేక్స్ (Rakes) లేకపోవడం వల్ల సీఎంఆర్ డెలివరీలపై ప్రభావం పడుతోందని, వెంటనే అదనపు రేక్స్ను కేటాయించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తికి అనుగుణంగా నిల్వ సామర్థ్యం లేదని, అదనంగా 15 LMTల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర పథకాల కింద సహకారం అందించాలని కోరారు.
2014-15 సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 1,468 కోట్ల లెవీ బియ్యం సబ్సిడీని విడుదల చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు. అలాగే, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద 2022 ఏప్రిల్లో పంపిణీ చేసిన బియ్యానికి సంబంధించిన రూ. 343.27 కోట్ల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు