నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఊరుమడ్ల గ్రామంలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. గ్రామంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఉదయం నుంచే వాగ్వాదాలు, ఆరోపణ-ప్రత్యారోపణలు చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలింగ్ బూత్ సమీపంలో ఇరు పార్టీల నేతలు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో గుంపుగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మధ్య తలెత్తిన మాటల యుద్ధం గ్రామం మొత్తానికి హీటెక్కించింది. మద్దతుదారుల సమక్షంలో ఇరువురు నేతలు కఠిన వాగ్వాదానికి దిగడంతో కార్యకర్తల మధ్య తోపులాటకు దారి తీసింది. కొద్ది సేపులోనే గందరగోళం పెరిగి ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది.
స్థితిగతులు వేగంగా మారుతుండడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరుపక్షాలను చెదరగొట్టారు. పరిస్థితి మరింత దిగజారకుండా స్థానిక పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. గ్రామంలో కీలక ప్రాంతాలను సీల్డ్ చేసి, బూత్ల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారులు స్వయంగా గ్రామంలో పర్యవేక్షణ చేపట్టారు.
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో గ్రామంలో ఓటర్లలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. “ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు” అని పలువురు ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నప్పటికీ రాజకీయ వర్గాల ఆగ్రహావేశం ఉద్రిక్తతకు దారి తీస్తోంది.
అధికారుల పర్యవేక్షణ, పోలీసుల అదనపు బందోబస్తు ఏర్పాటుతో పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వస్తున్నప్పటికీ, మరోసారి ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందన్న భయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. గ్రామం మొత్తం ఉద్రిక్త వాతావరణంలోనే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
నల్గొండ జిల్లా కొర్లపహాడ్లో పరస్పరం దాడి చేసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు
దాడిలో పలువురికి తీవ్ర గాయాలు
గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
ఈ మేరకు కొర్లపహాడ్ గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు pic.twitter.com/7pxWwlGG2V
— BIG TV Breaking News (@bigtvtelugu) December 11, 2025