TG Panchayat Elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని 545 గ్రామీణ మండలాల్లోని 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. పంచాయతీరాజ్శాఖ, ఎన్నికల సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు చేపట్టాయి. మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుమిదిని మీడియా సమావేశం ఏర్పాటు ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించనున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్కు పదిహేను రోజుల సమయం కేటాయించనున్నారు. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటించే అవకాశం ఉంది. మొదటి విడత తర్వాత నాలుగు రోజుల తేడాతో రెండు, మూడు విడతల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తులు చేస్తుంది.
డిసెంబర్ 15, డిసెంబర్ 19వ తేదీల్లో రెండు, మూడు విడతల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఈ విషయాలపై స్పష్టత రానుంది.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లు హైకోర్టులో నేడు విచారణకు రానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం హైకోర్టు సీజే ధర్మాసనం స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. సోమవారమే ఎన్నికల పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉండగా, నేటికి వాయిదా పడ్డాయి. పాత రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ హైకోర్టుకు వెల్లడించింది. మంగళవారం జరిగే కేబినెట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై చర్చించి తేదీలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలనలో ఉంది.
Also Read: Aadi Srinivas: తప్పిన పెను ప్రమాదం.. బేస్ మెంట్ కూలి ఆది శ్రీనివాస్తో పాటు 20 మంది..