Sarpanch Elections: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను అమలు చేసేందుకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, గ్రామ పంచాయితీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ పంచాయితీ రాజ్ శాఖ రేపు అధికారికంగా జీవో (Government Order) జారీ చేయనుంది. ఈ జీవో విడుదలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎదురైన కీలక అడ్డంకి తొలగిపోయినట్టే.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతంపై అధ్యయనం చేసి, ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు నియమించిన డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ఇదివరకే ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను రాష్ట్ర మంత్రివర్గం కూడ ఆమోదించింది. రిజర్వేషన్ల అమలుపై గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మంత్రులందరికీ ఫైల్ను పంపి సంతకాలు తీసుకునే ప్రక్రియను సైతం ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ విధంగా, పరిపాలనాపరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేసుకున్న ప్రభుత్వం.. రేపు జీవో జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ జీవోలో రిజర్వేషన్ల శాతం, వాటి కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన సమగ్ర వివరాలు ఉండనున్నాయి.
రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన జీవో విడుదలైన వెంటనే, రాష్ట్ర ఎన్నికల సంఘం ఒకటీ రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ను వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అధికారుల సన్నాహాల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ రెండవ వారంలో జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత, రాష్ట్రంలోని గ్రామ పంచాయితీలు, వార్డులకు సంబంధించిన ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. కొత్త రిజర్వేషన్ల అమలు నేపథ్యంలో.. ఈ ఎన్నికల ప్రక్రియపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. త్వరలోనే షెడ్యూల్ వెలువడుతుందని పంచాయితీ రాజ్ శాఖ వర్గాలు తెలియజేశాయి.
ALSO READ: RRB NTPC: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 5,810 ఎన్టీపీసీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు