Liquor Scam :
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. మద్యం పాలసీ రూపకల్పన సమయంలో ఢిల్లీ, తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన వారిపై దృష్టి పెట్టింది. అరబిందో ఫార్మా డైరెక్టర్ పెనక శరత్చంద్రారెడ్డి భార్య కనికా టేక్రివల్ కు చెందిన జెట్ సెట్ గో సంస్థ ఏర్పాటు చేసిన చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఇప్పటికే ఈడీ సేకరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఆ విమానాల్లో ఎక్కువగా ప్రయాణించినట్లు గుర్తించింది.
ఢిల్లీలో పలువురు మద్యం వ్యాపారులు, అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు సమావేశమైన తేదీలు, ఆ సమయంలో చార్టర్డ్ విమానాల్లో ప్రయాణించిన వారి వివరాలను ఈడీ విశ్లేషిస్తోంది. గత నెలలో ఎయిర్పోర్టు అథారిటీ నుంచి వచ్చిన డేటాలో ఉన్న సమాచారం ఆధారంగా ప్రైవేట్ జెట్ మేనేజర్లను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి ఈడీ కస్టడీలో ఉన్నారు.