Mahesh Kumar Goud: బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య ఉన్న అంతర్గత ఒప్పందాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎండగట్టారు. రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వ విప్లుగా నియమితులైన వారికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలుపారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన టీపీసీసీ చీఫ్ డ్రగ్స్ వ్యవహారంలో ప్రతిపక్షాల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈగల్ టీమ్ చేసిన దాడిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. ఒక ఎంపీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారని.. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ చుట్టూ ఉన్న బ్యాచ్ మొత్తం డ్రగ్స్ వ్యవహారాల్లో దొరుకుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేటీఆర్ ఫామ్ హౌస్లో ఆయన బామ్మర్ది డ్రగ్స్తో పట్టుబడటం.. ఆయన సన్నిహితుడు కేదార్ దుబాయ్లో డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం వల్ల చనిపోవడం వంటి ఘటనలు బీఆర్ఎస్ డ్రగ్స్ సంస్కృతికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఒకవైపు పోచంపల్లి ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు.. మరోవైపు డ్రగ్స్ పార్టీలు జరుగుతుంటే.. బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఇంతమంది దొరుకుతున్నా బీజేపీ మౌనంగా ఉండటం వెనుక పెద్ద కుట్రే ఉందని.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు.
బీజేపీ నేతలు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఆ పార్టీలో బీసీ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన ఉదాహరణలతో వివరించారు. బీజేపీకి ఎన్నో సేవలు అందించిన బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ సీటును కిషన్ రెడ్డి లాక్కున్నారని.. అలాగే బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి దించి కిషన్ రెడ్డి ఆ సీటును కూడా దక్కించుకున్నారని ఆరోపించారు. దత్తాత్రేయకు ఉన్న ఏకైక గవర్నర్ పదవిని కూడా మరొక అగ్రకుల నాయకుడు లాక్కున్నారని విమర్శించారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బీజేపీకి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని చెప్పారు.
డ్రగ్స్ విషయంలో బీజేపీ తమ వైఖరిని ప్రజలకు స్పష్టం చేయాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. వారం రోజులు గడుస్తున్నా డ్రగ్స్ దందాపై బీజేపీ నేతలు మాట్లాడకపోవడం వెనుక వారి మధ్య ఉన్న అపవిత్ర బంధం కనిపిస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో బీజేపీ అగ్ర నాయకులను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆ పార్టీ నేతలు మర్చిపోయారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లోనే కాకుండా బయట కూడా బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని.. అందుకే రఘునందన్ రావు వంటి వారు మాట్లాడకుండా వారి నోరు నొక్కేస్తున్నారని ఆయన విమర్శించారు.
Read Also: Telangana Budget-2026: కాంగ్రెస్ బడ్జెట్పై బీఆర్ఎస్ పెదవి విరుపు, అంతా ద్రోహమేనన్న జగదీష్రెడ్డి