Traffic restrictions: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే రాష్ట్రపతి హైదరాబాద్లో ఐదు రోజులు పర్యటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 నుండి 22 వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ముఖ్యంగా వివిఐపిల కదలికల వల్ల హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బొల్లారం, అల్వాల్, తిరుమలగిరి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ నిలిపివేయడం లేదా మళ్లింపులు చేయడం జరుగుతుంది కాబట్టి, వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
పర్యటన ప్రారంభంలో, అంటే డిసెంబర్ 17, 19 తేదీలలో మధ్యాహ్నం సమయాల్లో హకీంపేట నుండి తిరుమలగిరి వరకు ఉన్న ప్రధాన జంక్షన్లపై ప్రభావం అధికంగా ఉంటుంది. బొల్లారం చెక్ పోస్ట్, కౌకూర్ రోడ్, రిసాలా బజార్, లోతుకుంట, లాల్ బజార్ మీదుగా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ 19న అదనంగా బైసన్ సిగ్నల్, నేవీ హౌస్, ఆలుగడ్డబావి, సంగీత్ జంక్షన్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విస్తరించనున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.
డిసెంబర్ 20వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల మధ్యలో నగరంలోని ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతాలైన పంజాగుట్ట, బేగంపేట, జూబ్లీహిల్స్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గ్రీన్ల్యాండ్స్, రాజ్ భవన్ రోడ్, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుండి రోడ్ నంబర్ 45 వరకు ఉన్న ఫ్లైఓవర్లపై వాహనాల కదలికలను నిలిపివేస్తారు. అదేవిధంగా డిసెంబర్ 21న సాయంత్రం వేళల్లో బేగంపేట ఫ్లైఓవర్, రాసూల్పురా, సికింద్రాబాద్ క్లబ్ ఇన్ గేట్ పరిసరాల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి.
Also Read: శ్రీసత్య సాయి జిల్లాలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై మైనర్ బాలుడు అఘాయిత్యం
చివరి రోజైన డిసెంబర్ 22న రాష్ట్రపతి తిరుగు ప్రయాణం సందర్భంగా సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు మళ్లీ హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ మార్గంలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా అల్వాల్ టీ జంక్షన్, లోతుకుంట, కార్ఖానా ప్రాంతాల్లో వాహనదారులు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ సంబంధిత తక్షణ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ 9010203626 అందుబాటులో ఉంటుందని, ప్రజలందరూ పోలీసులకు సహకరించి అసౌకర్యాన్ని తగ్గించుకోవాలని ట్రాఫిక్ విభాగం విజ్ఞప్తి చేసింది.