Pawan Kalyan: ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర రైల్వే శాఖను కోరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి కొలువైన పుణ్యక్షేత్రం పిఠాపురానికి దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్థం ‘అమృత్’ పథకం కింద ఈ స్టేషన్ను అభివృద్ధి చేయాలని విన్నవించారు. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ప్రధానంగా పిఠాపురం రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణంపై లోతుగా చర్చించారు. ప్రస్తుతం సేతు బంధన్ పథకం కింద మంజూరైన ఈ ఆర్ఓబీని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని డిజిటిల్ మ్యాపింగ్ ద్వారా వివరించారు. 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగ్లను తొలగించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని, రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని పవన్ కళ్యాణ్ వివరించారు. రైల్వే ప్రాజెక్టుల అనుసంధానతను పెంచేందుకు గతిశక్తి పథకం ఎంతో దోహదపడుతుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వీటితో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పలు ఇతర రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల విస్తరణపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. పిఠాపురం స్టేషన్ ఆధునీకరణ, ఆర్ఓబీ అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారని, త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తన విన్నపాలకు సానుకూలంగా స్పందించినందుకు కేంద్ర మంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. పిఠాపురం వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధి వల్ల పర్యాటకం మెరుగుపడి స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Read Also: YS Jagan: రెండేళ్లలో రూ.3 లక్షల కోట్ల అప్పులా? చంద్రబాబు తీరుపై జగన్ తీవ్ర విమర్శలు