TGSRTC Merger: స్వేచ్చ బ్యూరో: టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా సాగుతోందని మహబూబ్నగర్ ప్రాంతీయ మేనేజర్ (ఆర్ఎం) సంతోష్కుమార్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంగళరావు సందర్శించిన సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలోని అంశాలను ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గతంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
విలీన ప్రక్రియ పూర్తయిన అనంతరం 2021 వేతన సవరణ అంశాలను కూడా సానుకూలంగా పరిశీలించే అవకాశం ఉందన్నారు. టీజీఎస్ఆర్టీసీ సంస్థలో విలీనం జరిగితే ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన ప్రయోజనాలు, సౌకర్యాలు, ఆర్థిక పరిరక్షణ లభించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన కార్మిక సంఘాలను పునరుద్ధరించాలని కార్మిక వర్గాలు కోరుతున్నాయని, ఈ డిమాండ్ పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. కార్మికులకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ద్వారా న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
Also read: షాకింగ్ ఫీచర్లు.. అమేజ్ఫిట్ నుంచి ఒకేసారి 3 కొత్త స్మార్ట్వాచ్లు లాంచ్.. ధరలు ఇవే!
ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో విలీన ప్రక్రియకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విలీనం వల్ల కార్మికులకు కలిగే ప్రయోజనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై స్పష్టత కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల భవిష్యత్తుకు భద్రత కల్పించడంతో పాటు వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉద్యోగులు అపోహలకు గురికాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ఆర్ఎం సంతోష్కుమార్ సూచించారు.
Also read: RV Karnan: జీహెచ్ఎంసీలో పెద్దన్న మౌనం.. అసలు కారణం అదేనా..?