Karimnagar District: కరీంనగర్ జిల్లా (Karimnagar District) వీణవంక మండలం ప్రజల జీవనం నిత్యం ప్రాణాల గండంలో సాగుతోంది. కారణం నియంత్రణలేని ఇసుక లారీలు. రోడ్లన్నీ లారీలతో నిండిపోయి, సాధారణ వాహనాలు ప్రయాణించాలంటే భయం తప్పడం లేదు. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ పక్కన ఉన్న ఇళ్లు పూర్తిగా దుమ్ము, దూళితో కప్పివేయబడ్డాయి. తలుపులు మూసుకున్నా దుమ్ము లోపలికి వస్తోందని, పిల్లలు, వృద్ధులు శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర వాహనాలు, అంబులెన్సులు, ఫైర్ వాహనాలు వెళ్లాలన్నా కనీసం రోడ్డు ఖాళీ లేకుండా ఇసుక లారీ డ్రైవర్లు ఇష్టానుసారంగా వాహనాలు నిలుపుతున్నారు. పార్కింగ్ సూచికలు లేకుండా, రోడ్డు మీదే లారీలు నిలిపివేయడం వల్ల ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. అయినా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక లారీలు రోడ్డు మీద కనిపించకుండా నిలిచిపోవడం వల్ల రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోంది.
ఇది రోడ్డు భద్రతా? లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమా?” అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నలు ఇవే ఇసుక లారీలపై పర్యవేక్షణ ఎవరి బాధ్యత? రోడ్డును గోదాములా మార్చిన లారీ యజమానులపై చర్యలు ఎప్పుడు? ప్రమాదం జరిగాకే అధికారులు స్పందిస్తారా? వీణవంక మండలం యమలోకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారకుండా ఉండాలంటే తక్షణ చర్యలు, తీసుకోవాలి. లారీ నియంత్రణ, రోడ్ భద్రత అమలు తప్పనిసరి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.