Kodad Job Mela:స్వేచ్ఛ బ్యూరో: కోదాడలో ఈనెల 19న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ద్వారా మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.దాదాపు 300 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయని, వేలాది ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నాయని తెలిపారు. ఉద్యోగాల కోసం గ్రామీణ యువత నగరాలు, ఇతర రాష్ట్రాల చుట్టూ తిరిగే పరిస్థితిని మార్చి, కంపెనీలనే వారి వద్దకు తీసుకురావాలన్న సంకల్పంతో ఈ భారీ నియామక కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.కోదాడలో ఆదివారం జాబ్ మేళా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకొని, తమ బయోడేటా ఐదు ప్రతులతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
19న కోదాడకు 300 కంపెనీలు
దాదాపు 300 కంపెనీలు మొత్తం 27 వేల మంది ఉద్యోగుల అవసరంతో కోదాడకు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అందులో కనీసం 15 శాతం అవసరాన్ని తీర్చగలిగినా మూడు వేల నుంచి నాలుగు వేల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపగలిగితే అది గొప్ప విజయమే కాకుండా తనకు ఎంతో సంతృప్తినిచ్చే సందర్భమవుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన యువతకు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులకు నేరుగా అనుసంధానం కల్పించడమే ఈ జాబ్ మేళా ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.చేతిలో పట్టా, కళ్లలో భవిష్యత్తుపై ఎన్నో కలలు ఉన్నప్పటికీ సరైన సమాచారం, పరిచయాలు, అవకాశాలు లేక అనేకమంది యువత ఉద్యోగాలకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి కంపెనీకి ప్రత్యేక ఇంటర్వ్యూ..
జాబ్ మేళాలో పాల్గొనే ప్రతి కంపెనీకి ప్రత్యేక ఇంటర్వ్యూ గదులు ఏర్పాటు చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద అభ్యర్థులకు సహాయపడేందుకు సమాచార కేంద్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమాచార ప్రకటన వ్యవస్థ, వాహనాల నిలుపుదల, భోజన సదుపాయాలు, తాగునీరు, అభ్యర్థులు సులభంగా రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు వేర్వేరు విడతల్లో నియామక పత్రాలను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతీ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక నిర్వహణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమిటీ ప్రతి రెండు రోజులకు ఒకసారి సమావేశమై ఏర్పాట్ల పురోగతిని సమీక్షిస్తుందన్నారు. కంపెనీలు, నియామక ప్రక్రియల సమన్వయం, భోజనం, వాహనాల నిలుపుదల, ప్రచారం, సామాజిక మాధ్యమాలు, ఇతర సదుపాయాల కోసం వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్యావంతులైన నిరుద్యోగ యువతీ యువకులు కోదాడ మెగా జాబ్ మేళాను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ఎన్. పద్మావతీ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన యువత ముందుగానే ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకొని, బయోడేటా ఐదు ప్రతులతో జాబ్ మేళాకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
Also Read: విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్