Telangana Water: శ్రీశైలంలో ప్రాజెక్ట్లో 120 టీఎంసీలు, నాగార్జునసాగర్లో 70 టీఎంసీల నీరు మాత్రమే కనిపిస్తోందని.. మిగిలిన సుమారు 200 టీఎంసీల నీరు ఏమైందో లెక్క చెప్పాలని బీఆర్ ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పత్తా లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. పాలకుల దృష్టి ప్రజా సమస్యలపై కాకుండా భూముల దోపిడీపైనే ఉందని ఆరోపించారు. ప్రధానంగా తెలంగాణకు వచ్చే నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రానికి దక్కాల్సిన నీటిని ఏపీ తరలిస్తున్న ప్రభుత్వం స్పందించట్లేదన్నారు.
పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా ఏపీకి నీటిని తరలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఫైరయ్యారు. తెలంగాణకు రావాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం తక్షణమే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకుని ఈ ప్రాంత రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నీటి విడుదల షెడ్యూల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సాగర్లో ఉన్న నీటితో రైతులకు మొదటి పంటకు సాగునీరు అందించవచ్చని మాజీ మంత్రి అన్నారు. కేవలం 30 టీఎంసీల నీటితో ఒక పంటకు నీరు అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎడమ కాల్వ, వరద కాల్వ, ఏఎంఆర్పీ ఆయకట్టుకు తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Also read: కిచిడీ అమ్ముతూ.. ఎంబీబీఎస్ సీట్లు సాధించిన అన్నదమ్ములు!
తెలంగాణ రైతుల నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తదని జగదీష్ రెడ్డి అన్నారు. నీళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ రైతులకు సాగునీరు అందే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.
కేటీఆర్ ప్రకటించిన పాదయాత్రకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై జగదీష్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకు నీళ్లు, వాటర్ తప్ప మరేమీ పట్టడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన పరిధిలోని ఉదయ సముద్రం ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కన్నెపల్లిలో నీళ్లు అందుబాటులో ఉన్నా ఎత్తిపోతలు చేపట్టడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ధరణిని తొలగించి భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రవేశపెట్టిన భూభారతి రాష్ట్రంలోని 50 శాతానికి పైగా భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బంది పెడుతోందన్నారు. తమ భూములు నిషేధిత జాబితాలో ఉండటంతో రైతులు ఇతర వర్గాల ప్రజలు సబ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నట్లు చెప్పారు. విద్యుత్ కోతలు లేకుండా నిరంతరం విద్యుత్ అందించే విషయంలోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చివరికి మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని, ప్రజలకు ఇతర సదుపాయాలను కల్పించడంలోనూ సర్కార్ నిర్లక్ష్యం కనిపిస్తోందని మండిపడ్డారు.
Also read: పిల్లల్లో క్యాన్సర్కు ముందు కనిపించే లక్షణాలివే.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!