Telangana Liberation: స్వేచ్ఛ బ్యూరో: పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ విమోచన చరిత్రను చేర్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. ఆపరేషన్ పోలో ప్రారంభ దినోత్సవం(సెప్టెంబర్ 13) సందర్భంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న చారిత్రక యుద్ధ ట్యాంక్ వద్ద తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘన నివాళులర్పించి, మాజీ సైనికులను రాంచందర్ రావు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. భారతదేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన ఆపరేషన్ పోలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆత్మబలిదానాల వల్లే నేడు మనం భారత యూనియన్లో అంతర్భాగమై గర్వంగా జీవిస్తున్నామన్నారు.
ట్యాంక్బండ్పై కొలువై ఉన్న యుద్ధ ట్యాంక్ తెలంగాణ ప్రజలకు ఒక నిరంతర స్ఫూర్తి కేంద్రమని కొనియాడారు. ఒకవేళ ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ దృఢ నిర్ణయం, కేఎం మున్షీ చొరవ, ఆపరేషన్ పోలో సైనిక చర్య లేకపోయి ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడానికే భయమేస్తుందని వ్యాఖ్యానించారు. దేశ సమగ్రతకు అడ్డంకిగా మారిన విద్రోహ శక్తులను అంతమొందించేందుకు 1948 సెప్టెంబర్ 13న పటేల్ ఆపరేషన్ పోలోకు శ్రీకారం చుట్టారన్నారు. నాలుగు రోజుల పాటు సాగిన ఈ పోరాటంలో ఎంతోమంది సైనికులు ప్రాణాలర్పించి, సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారని ఆయన గుర్తుచేశారు. సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ ప్రజలందరికీ అత్యంత పవిత్రమైన విమోచన దినోత్సవమని, ఈ రోజును ప్రభుత్వపరంగా అధికారికంగా నిర్వహించాలని బీజేపీ దశాబ్దాలుగా ఉద్యమిస్తోందని ఆయన పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి, మజ్లిస్ కు భయపడి వెనకడుగు వేసిందని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గాంధీ భవన్లో పార్టీ కార్యక్రమంగా జరుపుకుంటోందే తప్ప, ప్రభుత్వపరంగా పూర్తిస్థాయిలో నిర్వహించకుండా ప్రజాపాలన పేరిట అసలు చరిత్రను మరుగున పరుస్తోందని విమర్శించారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అమరవీరుల త్యాగాలను విస్మరించడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు. భవిష్యత్ తరాలకు తెలంగాణ స్వాతంత్ర్య పోరాట చరిత్ర, వందేమాతరం విలువలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, పాఠశాల పాఠ్యపుస్తకాల్లో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన పోరాట చరిత్రను సమగ్రంగా పొందుపరచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. సైనికుల త్యాగాలను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర విమోచన ఉత్సవ కమిటీను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Also read: ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!
1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడం తెలంగాణ చరిత్రలో కీలక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నిజాం, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాడారని తెలిపారు. వీరభైరాన్పల్లి, అప్పంపల్లి వంటి ప్రాంతాల్లో అమరులైన వీరుల త్యాగాలు తెలంగాణ విమోచన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సర్దార్ పటేల్ నాయకత్వంలో ఆపరేషన్ పోలో చేపట్టి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించారని తెలిపారు. విమోచన చరిత్రను రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని విమర్శించారు. ఈ చరిత్ర ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను తెలియజేయాల్సిన చారిత్రక బాధ్యత అని అన్నారు.
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన పోరాటం, భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ పోలో తెలంగాణ విమోచన చరిత్రలో కీలక ఘట్టాలని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికుల త్యాగాలను గౌరవించడం, వారి సేవలను భావితరాలకు తెలియజేయడం అందరి బాధ్యత అని అన్నారు. తెలంగాణ విమోచన కమిటీ కన్వీనర్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు చాటిచెప్పడమే తెలంగాణ విమోచన కమిటీ ప్రధాన లక్ష్యమని అన్నారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడంలో ఆపరేషన్ పోలో కీలక పాత్ర పోషించిందన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ప్రతి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని చారిత్రక స్ఫూర్తితో నిర్వహిస్తూ, అమరవీరుల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ విమోచన కమిటీ నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తుందని శ్రీవర్ధన్ రెడ్డి తెలిపారు.
Also read: నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!