Minister Narayana: నెల్లూరు నగర అభివృద్ధి, చెత్త నిర్వహణపై ప్రతిపక్ష ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇస్తూ.. నెల్లూరును దేశంలోనే నంబర్ వన్ మోడల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అభివృద్ధిపై విమర్శలు తగవు
60 ఏళ్లుగా పేరుకుపోయిన అల్లిపురం డంపింగ్ యార్డును తొలగించి నగరాన్ని శుభ్రం చేస్తుంటే విమర్శలు చేయడం తగదని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ-టెండర్ల ద్వారా పారదర్శకంగా పనులు జరుగుతుంటే అవినీతి బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. పన్నుల రూపంలో ప్రజలు కట్టిన ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఉచిత CSR నిధులతో చెట్లు నాటిస్తుంటే వ్యాఖ్యానించడం సరికాదన్నారు. వ్యాపారంలో నష్టపోయిన ముస్లిం నేత అజీజ్కు మానవత్వంతో సహాయం చేశామని, తనపై ఆరోపణలు చేయడానికి ఏమీ లేక ఎన్నికల వేళ ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
విద్యారంగానికి బహుళ ప్రాచుర్యం
ఈ నెల 16వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి చేతుల మీదుగా నెల్లూరులో కార్పొరేట్ స్థాయి వసతులతో రెండు ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ వేమిరెడ్డి, డిఎస్ఆర్ కుటుంబాల ట్రస్టుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని పునర్నిర్మించారు. ముఖ్యంగా ఒక మహల్ తరహాలో రూపుదిద్దుకున్న మూలాపేట గర్ల్స్ స్కూల్ను స్థానికులు ఇప్పుడు ‘కోట స్కూల్’ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు.
నిధుల వరద.. నంబర్ వన్ మోడల్ సిటీ
నగర మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు ‘అమృత్’ పథకం కింద రూ. 234 కోట్లు, భూగర్భ డ్రైనేజీ పనుల కోసం ప్రత్యేకంగా రూ. 250 కోట్లు విడుదలయ్యాయి. 100 కిలోమీటర్ల పరిధిలోని చెత్తను ప్రాసెస్ చేసేలా ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే 3 ఏళ్లలో నెల్లూరును దేశంలోనే నంబర్ వన్ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: ఇంద్రవెల్లి వేదికగా కవిత బిగ్ స్కెచ్.. అక్టోబర్లో భారీ బహిరంగ సభ!