Uttam Kumar Reddy: తెలంగాణ శాసనసభ వేదికగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న నీటి పారదోలకం, పంటల సాగు, జల వనరుల పరిస్థితిపై ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు, తీవ్రమైన ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. వర్షపాతం తగ్గుదల, సాగునీటి కొరతపై ప్రభుత్వం ముందస్తుగానే అన్నదాతలను అప్రమత్తం చేసిందని,వ ఆయకట్టు వారీగా జలాశయాల నీటి నిల్వల ఆధారంగా పంటల ఎంపికపై రైతులకు సరైన మార్గదర్శనం చేశామని తెలిపారు.
శ్రీశైలం, సాగర్ అసలు లెక్కలు ఇవే..
తాగునీటి అవసరాలకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఆ అవసరాలు తీరిన తర్వాతే మిగులు జలాలను సాగుకు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నీటి నిల్వల సంరక్షణకు ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నీటి బడ్జెట్ను అమలు చేస్తూ, ప్రతి పది రోజులకోసారి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని, రాష్ట్రంలోని చెరువుల్లో కూడా 40 శాతం నీరు చాలా తక్కువ స్థాయిలో ఉందన్నారు.
కృష్ణా నీటిలో 50:50 వాటా కావాల్సిందే..
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన 50:50 వాటా కోసం ట్రిబ్యునల్, కేఆర్ఎంబీ , కేంద్ర ప్రభుత్వం వద్ద గట్టిగా వాదిస్తున్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ నిర్మాణ లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజీ నిరుపయోగంగా మారిందని, ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం బ్యారేజీలు సురక్షితం కాదని తేలడంతో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కాళేశ్వరం బ్యారేజీలను వాడలేమని వివరించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్న ప్రచారంలో నిజం లేదని, కాలువలు, భూసేకరణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. సాంకేతిక మార్గదర్శకాలకు అనుగుణంగా మరమ్మతులు చేపడుతూ, నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. దానం నాగేందర్పై హైకోర్టు అనర్హత వేటు