Sunitha Murder Case: హైదరాబాద్ వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం మధ్యాహ్నం అత్యంత ఘోరమైన హత్య చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న 29 ఏళ్ల సునీతను ఆమె మాజీ భర్త దేవరకొండ మహేశ్ కత్తులతో పొడిచి కిరాతకంగా చంపాడు. బాధితురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భిణి అని పోలీసులు వెల్లడించారు. కెనడాలో స్థిరపడిన ఈ జంట మధ్య విభేదాలు రావడంతో 2024లో విడాకులు తీసుకున్నారు. అయితే సునీత 2025లో త్రినాథ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోవడం నిందితుడు మహేశ్ జీర్ణించుకోలేకపోయాడు. తాజాగా ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వనస్థలిపురం సీఐ మహేశ్ అందించిన వివరాల ప్రకారం.. తనతో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుందన్న కోపం.. ఆమె రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిపారు. విడాకుల అనంతరం ఆమె మరొకరిని వివాహం చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చూసి మాజీ భర్త మహేశ్ తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు. సునిత తన రెండో పెళ్లికి సంబంధించిన అడ్రస్, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా నిందితుడు వాటి ద్వారానే ద్వారా ఆమె నివాసాన్ని ట్రాక్ చేసి రెండు నెలల క్రితమే నగరానికి చేరుకున్నాడు.
నిందితుడు పక్కా ప్లాన్తో ఈ హత్యకు ఒడిగట్టాడు. అపార్ట్మెంట్ వద్ద మూడు రోజుల పాటు రెక్కి నిర్వహించి బుధవారం మధ్యాహ్నం వాచ్మెన్ లేని సమయం చూసి లోపలికి ప్రవేశించాడు. తన వెంట తెచ్చుకున్న బ్యాగులో రెండు కత్తులు ఒక చైన్ సా యంత్రం పెట్రోల్ బాటిల్ను సిద్ధం చేసుకున్నాడు.
సునీత గదిలోకి ప్రవేశించిన వెంటనే నిందితుడు లోపల నుంచి గడియ పెట్టుకున్నాడు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని ముందే ఊహించి తలుపులు పగలగొట్టడానికి అవసరమైన టూల్స్ కూడా కొనుగోలు చేశాడు. గదిలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిన నిమిషాల్లోనే మహేశ్ ఆమెపై కత్తులతో దాడికి దిగాడు. శరీరంపై పలుచోట్ల పొడవడమే కాకుండా తలపై కూడా తీవ్రంగా గాయపరిచి ప్రాణాలు తీశాడు. సునీత అరుపులు విన్న కుటుంబ సభ్యులు గది వద్దకు వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది.
హత్య చేసిన తర్వాత నిందితుడు గదిలో పెట్రోల్ పోసి ఎవరైనా లోపలికి వస్తే నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని నచ్చజెప్పి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేలా చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో సునీత పెట్టిన గృహహింస కేసు వల్ల మహేశ్పై లుకౌట్ సర్క్యూలర్ జారీ అయిందని అందుకే అతని పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్నారని డీసీపీ అనురాధ తెలిపారు. దీనివల్ల కెనడా వెళ్లలేకపోయిన నిందితుడు తన కెరీర్ నాశనానికి తల్లి మరణానికి సునీతనే కారణమని కక్ష పెంచుకున్నాడు. ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.
Read Also: Narsingi Minor Rape Case: నార్సింగిలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. ఇద్దరు నిందితుల అరెస్ట్!