గాంధీ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు కేంద్ర ప్రభుత్వంపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ‘నరేంద్ర మోదీని గద్దె దించుదాం.. ఓబీసీలను కాపాడుకుందాం’ అనే నినాదంతో పోరాటాన్ని ఉధృతం చేస్తానని ప్రకటించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ కంట్రోల్ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేతుల్లో ఉందని విమర్శించారు. దేశాన్ని ముక్కలు చేయడమే ఆర్ఎస్ఎస్ ప్రధాన ఉద్దేశమని ఆయన మండిపడ్డారు.
బీసీలు అంటే కేవలం ఓట్లేసే మిషన్లమా?
బీసీ సామాజిక వర్గాల దుస్థితిపై వీహెచ్ భావోద్వేగంగా మాట్లాడారు. ‘బీసీలు అంటే కేవలం ఓట్లేసే మిషన్లమా? ఎన్నికల సమయంలో మా ఓట్లు కావాలి కానీ.. అధికారం చేపట్టడానికి మేము పనికిరామా?’ అని ప్రశ్నించారు. ఎన్ని రోజులు బీసీలు అడుక్కుతినే స్థితిలో ఉండాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం తాను యుద్ధానికి సిద్ధమయ్యానని వెల్లడించారు. మోదీ సాగిస్తున్న కుట్రలను ప్రజలకు వివరించేందుకు పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.
కులగణన చేయకపోతే అన్యాయమే..
కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జనగణనలో కుల గణనను చేర్చకపోతే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని వీహెచ్ హెచ్చరించారు. ప్రస్తుత గణనలో బీసీల ప్రస్తావనే లేకపోవడం దారుణమన్నారు. జనాభా ప్రాతిపదికన హక్కులు దక్కాలంటే కుల గణన తప్పనిసరి అని డిమాండ్ చేశారు. చదువుకుంటేనే బతుకులు మారుతాయని జ్యోతిరావు ఫూలే చెప్పిన మాటలను గుర్తు చేస్తూ.. ఫూలే అడుగుజాడల్లోనే అంబేద్కర్ నడిచారని వివరించారు.
కాంగ్రెస్తోనే న్యాయం..
దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం బీసీల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు. అణగారిన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కుల గణన అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చి ప్రజల్లో చైతన్యం నింపుతానని వీహెచ్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
ALSO READ: బాసర క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి.. మనవడి అక్షరాభ్యాసం.. ఆలయ అభివృద్ధికి శ్రీకారం!