Air India Cancels Israel Routes: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా, ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, న్యూఢిల్లీ నుంచి టెల్ అవీవ్కు వెళ్లే విమాన సర్వీసులను మే 31 వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.
ఇటీవల పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఇప్పటికే టెల్ అవీవ్కు సర్వీసులను నిలిపివేశాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్ కు చెందిన కొన్ని విమానయాన సంస్థలు మాత్రమే పరిమిత ఆంక్షల మధ్య తమ సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియా తాజా నిర్ణయంతో ఇజ్రాయెల్ లో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ దాదాపు 40 వేల మందికి పైగా భారతీయులు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్ల భారత్ కు రావాలనుకునే వారికి ఈ విమానాల రద్దు ఇబ్బందిగా మారనుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి రావాలనుకునే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ నుంచి బయటకు రావాలనుకునే భారతీయులు జోర్డాన్ లేదంటే ఈజిప్టు లాంటి పక్క దేశాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. అక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఈ రూట్ కొంత సమయం తీసుకున్నప్పటికీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మార్గాలలో ఇదే కీలకమైనది.
అటు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, టెల్ అవీవ్ లోని భారత రాయబార కార్యాలయం కీలక చర్యలు చేపడుతోంది. భారతీయులకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. 24 గంటలు పని చేసే అత్యవసర హెల్ప్ లైన్ ను ప్రారంభించింది. ఎవరైనా సమస్యల్లో ఉంటే వెంటనే సంప్రదించేందుకు అవకాశం కల్పించింది. అదేవిధంగా, అక్కడి భారతీయుల వివరాలను సేకరించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ కూడా నిర్వహిస్తోంది. ఇటీవల రాయబారి, రాయబార కార్యాలయ బృందం వర్చువల్ సమావేశం నిర్వహించి, ఇజ్రాయెల్లో ఉన్న భారతీయ కార్మికులు, విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలు, ఆందోళనలు తెలుసుకుని, అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మాత్రమే కాకుండా, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు నిరంతరం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో, అక్కడ ఉన్న భారతీయులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు సూచించారు. అధికారిక సూచనలను పాటిస్తూ, అవసరమైతే రాయబార కార్యాలయాన్ని సంప్రదించడం మంచిదన్నారు.
Read Also: విమాన ప్రయాణికులకు షాక్.. 60% ఉచిత సీట్ల రూల్ కు బ్రేక్!