MLC Basavaraj Sarayya: వరంగల్ నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ) కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే తన సీటు వద్ద నేమ్ బోర్డు లేకపోవడాన్ని గమనించిన ఆయన, అది తనను వ్యక్తిగతంగా అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను ఈ సమావేశానికి ఎందుకు పిలిచారు? మీరు మనుషులా లేక గాడిదలా?’ అంటూ అధికారులపై నిప్పులు చెరిగారు.
కౌన్సిల్ హాల్లో కార్పొరేటర్లందరికీ నేమ్ బోర్డులు ఏర్పాటు చేసి, ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్సీగా ఉన్న తనకు బోర్డు పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తికి కనీస మర్యాద ఇవ్వడం చేతకాదా అని ప్రశ్నించారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన ఆయన, అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
అయితే, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మేయర్ గుండు సుధారాణి ,ఇతర సభ్యులు జోక్యం చేసుకున్నారు. పొరపాటు జరిగిందని, దీనిని సరిదిద్దుతామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, సారయ్య మాత్రం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని తప్పుబడుతూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక సీనియర్ నాయకుడికి సభలో ఇలాంటి చేదు అనుభవం ఎదురవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Read: గజరాజులకు ‘ఆధార్’.. ఏపీ అటవీశాఖ వినూత్న ముందడుగు!