Warangal Municipal Election: ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను హస్తం పార్టీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ప్రధానంగా 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించగా, హంగ్ ఏర్పడిన కీలక స్థానాల్లో కూడా వ్యూహాత్మకంగా పైచేయి సాధించింది. ఈ ఫలితాలు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పట్టును మరోసారి నిరూపించాయి.
జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ‘హంగ్’ ఏర్పడింది. తీవ్ర ఉత్కంఠ మధ్య నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ రెండు పీఠాలు కూడా కాంగ్రెస్నే వరించడం విశేషం. జనగామ మున్సిపల్ చైర్పర్సన్గా బాలమణి (కాంగ్రెస్), వైస్ చైర్మన్గా పర్వతాలు (ఇండిపెండెంట్) ఎన్నికయ్యారు. అలాగే తొర్రూరులో తూనం శ్రవణ్ చైర్మన్గా, రజిని వైస్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టనున్నారు. డోర్నకల్లో కుండేటి రాజకుమారి, లావణ్య పీఠాన్ని దక్కించుకున్నారు.
జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ తన విజయకేతనాన్ని ఎగురవేసింది. భూపాలపల్లిలో బుర్ర కొమురయ్య, నర్సంపేటలో పెండెం శ్రీలక్ష్మి, పరకాలలో పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. స్టేషన్ ఘన్పూర్లో తాటికొండ వినయ్ కుమార్, వర్ధన్నపేటలో పాలకుర్తి సారంగపాణి విజయం సాధించి మున్సిపల్ పీఠాలను అధిష్టించారు. ములుగులో చింతనిప్పుల చంద్రకళ, మహబూబాబాద్లో గుగులోతు జ్యోతి, మరిపెడలో వీసారపు ప్రగతి, కేసముద్రంలో బానోత్ సునీత చైర్పర్సన్లుగా ఎన్నికై మహిళా ప్రాతినిధ్యాన్ని చాటారు.
ఈ అఖండ విజయంపై కాంగ్రెస్ శ్రేణులు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నాయి. లక్కీ డ్రాలో కూడా తమకే అదృష్టం కలసిరావడంపై కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల అభివృద్ధికి ఈ కొత్త పాలకవర్గాలు అంకితభావంతో పనిచేస్తాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kalvakuntla Kavitha: ప్రజా భవన్ ఎదుట కవిత ఆందోళన.. ఎందుకంటే?