తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో భారీస్థాయి సమావేశం జరగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా ఈ భేటీ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ మొత్తం హస్తిన బాట పట్టనుంది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.
ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే.. రాహుల్ గాంధీ.. కేసి వేణుగోపాల్ ఈ సమావేశానికి హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్య నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో తెలంగాణ బృందానికి సమయం కేటాయించారు. రాష్ట్రంలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన సమావేశంగా దీనిని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రధానంగా రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై హైకమాండ్ ఆరా తీయనుంది. ఎన్నికల హామీల అమలు తీరు.. సంక్షేమ పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వనున్నారు. పాలనలో ఎదురవుతున్న సవాళ్లు.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే వ్యూహాలపై చర్చ సాగనుంది. భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసే దిశగా అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
మంత్రి వర్గంలోని సభ్యులందరినీ ప్రత్యేకంగా పిలిపించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది. శాఖల వారీగా పనితీరును సమీక్షించడంతో పాటు లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేసే అంశాలపై దృష్టి పెట్టనున్నారు. పార్టీ కార్యకర్తలకు.. ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి రావలసిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సిన విధానాలపై కూడా ఈ భేటీలో మాట్లాడనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాబోయే రోజుల్లో చేపట్టబోయే భారీ బహిరంగ సభలు.. పార్టీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.