2029 అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తుందని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. పార్టీ పేరు ఇదే ఉంటుందా…? లేదా..? అనేది ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చిన మేము తప్పకుండా పోటీ చేస్తామని అమె చెప్పారు. గద్వాల జిల్లాలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. జిల్లాలోని అక్షరాస్యత, సామాజిక పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రక, సాంస్కృతిక, సాహితీ వైభవానికి నెలువైన గద్వాల జిల్లా నేడు అక్షరాస్యతలో వెనుకబడి ఉండటంపై కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటించిన ఆమె, గణాంకాలతో సహా రాష్ట్ర ప్రభుత్వంపై, స్థానిక ఎంపీపై విమర్శలు గుప్పించారు.
భారతదేశ సగటు అక్షరాస్యతతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి ఆశాజనకంగా లేదని కవిత విశ్లేషించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అక్షరాస్యత 80.09 శాతంగా ఉంటే.. తెలంగాణలో అది కేవలం 77.9 శాతానికే పరిమితమైందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ తెలంగాణలో ఈ శాతం 69.9 గా ఉండటం దారుణమని అన్నారు. మహిళా అక్షరాస్యత విషయంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని.. గత ఏడాది నుంచి ఇది 4 శాతం తగ్గి 65.9 శాతానికి పడిపోయిందని ఆమె వివరించారు. ఈ గణాంకాలను ఉటంకిస్తూ.. ‘ఇది తెలంగాణ రైజింగ్ నా లేక ఫాలింగ్ నా?’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ప్రశ్నించారు.
గద్వాల జిల్లాలోని అక్షరాస్యత రేటును ప్రస్తావిస్తూ స్థానిక నాయకత్వంపై ఆమె మండిపడ్డారు. జిల్లాలో అక్షరాస్యత కేవలం 49.8 శాతంగా ఉండగా.. అందులో మహిళల వాటా 39.4 శాతం మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. ముఖ్యంగా కేటిదొడ్డి మండలంలో అక్షరాస్యత 33.77 శాతానికే పరిమితం కావడంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సమాధానం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వారు జిల్లా విద్యాభివృద్ధిని ఎందుకు విస్మరించారని ఆమె నిలదీశారు.
రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఉండాలని కవిత సూచించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నప్పటికీ.. స్థానికంగా ఉన్న ఆసుపత్రి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఆమె గుర్తు చేశారు. తెలంగాణ సమాజం చదువులో వెనుకబడితే అది రాష్ట్ర భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని, ప్రభుత్వం ఇప్పటికైనా ప్రకటనలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.