Educated Sarpanches: రాజకీయాలంటే కేవలం సీనియర్ నాయకులకే పరిమితం అనే రోజులు పోయాయి. సమాజంలో మార్పు కోసం, పుట్టిన ఊరి రుణం తీర్చుకోవడం కోసం ఉన్నత విద్యావంతులు ఇప్పుడు గ్రామ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అత్యున్నత విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు సర్పంచులుగా గెలుపొంది, నేడు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు.
గంగాధర మండలంలో మొత్తం 33 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో మూడు ప్రధాన గ్రామాల్లో విద్యావంతులు విజయం సాధించారు. కురిక్యాల గ్రామానికి చెందిన కడారి రేణుక (MSc జువాలజీ), ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రభాకర్ రెడ్డి (PG, PhD), చర్లపల్లి (ఆర్) గ్రామం నుంచి ఎట్టపు కనకయ్య (LLB) భారీ మెజారిటీతో సర్పంచులుగా ఎన్నికయ్యారు. కనకయ్య ప్రస్తుతం అడ్వకేట్గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సోమవారం ఆయా గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో వీరు పాలకవర్గ సభ్యులతో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ.. తమ ఉన్నత చదువులు గ్రామాభివృద్ధికి ఉపయోగపడాలనే సంకల్పంతోనే ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. గ్రామంలో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ, వీధి దీపాలు, సిసి రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ల సహకారంతో నిధులు తీసుకువచ్చి తమ గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అలాగే, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించేలా మార్గనిర్దేశం చేస్తామని తెలిపారు. తమపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Read Also: Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..