Mahabubabad News: ప్రభుత్వ కార్యాలయాలు పౌరులకు సేవలు అందించే కేంద్రాలుగా కాకుండా.. కొందరు అవినీతి అధికారుల కారణంగా లంచాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే తమ పని జరగదని అధికారులు రైతులకు ముఖం మీదే తేల్చిచెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం, కొమ్ములవంచ గ్రామంలో జరిగిన తాజా సంఘటన ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తోంది.
కొమ్ములవంచ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు పంట రుణం కోసం అవసరమైన పహాణీని తీసుకోవడానికి నర్సింహులపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం అతనికి పహాణీ పత్రం సిద్ధమైంది. అయితే.. ఆ పత్రాన్ని చేతికి ఇవ్వడానికి కార్యాలయంలోని రికార్డు అసిస్టెంట్ అధికారి రూ. 4,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సమస్య మొదలైంది.
పని పూర్తయినా కూడా అధికారులు అదనపు డబ్బులు అడగడంతో రైతు మల్లయ్య ఆవేదనకు గురయ్యారు. ‘తమ ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇవ్వాల్సిందే, అప్పుడే పహాణీ ఇస్తాం’ అని రికార్డు అసిస్టెంట్ స్పష్టం చేసినట్లు మల్లయ్య తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం ఒక్క రూపాయి కూడా లేదని, పంట రుణం కోసమే పహాణీ తీసుకోవడానికి వచ్చానని ఎంత బతిమాలినా, అధికారులు కనికరించలేదని రైతు మల్లయ్య కన్నీటి పర్యంతమయ్యారు.
డబ్బులు ఇస్తేనే పహాణీ ఇస్తామని, లేదంటే ఇవ్వబోమని రికార్డు అసిస్టెంట్ దౌర్జన్యంగా వ్యవహరించారని.. రైతు మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం, రుణాలు పొందడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పత్రాల కోసం కూడా సామాన్య రైతులు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అధికారులు పేద రైతులను వేధించడం తగదని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, లంచం అడిగిన రికార్డు అసిస్టెంట్పై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు లంచం లేకుండా సేవలు అందించేలా చూడాలని స్థానిక రైతులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కిందిస్థాయి సిబ్బంది ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది.
ALSO READ: Futuristic Trains: ప్రపంచంలోనే అద్భుతమైన రైళ్లు, పట్టాలెక్కాయంటే రైల్వే రూపురేఖలు మారాల్సిందే!