Yellampet Rain: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఆదివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సుమారు ఉదయం 10 గంటల సమయంలో కురిసిన వర్షంతో ముఖ్యంగా రావల్ కోల్–శివాజీ విగ్రహం ప్రాంతంలో రహదారులపై పెద్దఎత్తున నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక రహదారులపై నిలిచిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్ల పరిసరాల్లోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చిన్నారులు, వృద్ధులు బయటకు రావడానికి అవస్థలు ఎదురయ్యాయి.
ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోతున్నా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రధాన రహదారులు, కాలనీల్లో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయడంతో పాటు వర్షపు నీరు సులభంగా వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారులపై నిలిచిన నీటిని తొలగించాలని, భవిష్యత్తులో వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా శాశ్వత డ్రైనేజీ పరిష్కారం చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.
Also read: జీహెచ్ఎంసీ రూటే సెపరేటు.. అక్రమ నిర్మాణాలపై చర్యలేవీ?