Yellampet Municipality: ఎల్లంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తం 24 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 13 కాగా, బీఆర్ఎస్ 12 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాలు, బీజేపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమాచారం మేరకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి(MLA Malla Reddy) తన వ్యూహాలతో బీఆర్ఎస్ అభ్యర్థులను క్యాంపులో ఉంచి మరో సభ్యుడిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక అభ్యర్థి మద్దతు లభిస్తే చైర్మన్, వైస్ చైర్మన్ రెండు పదవులు బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశముంది. ఇక బీజేపీకి చెందిన సభ్యుడికి వైస్ చైర్మన్ పదవి ఇచ్చి, చైర్మన్ స్థానాన్ని బీఆర్ఎస్(BRS)బీఆర్ఎస్ దక్కించుకునేలా చర్చలు జరుగుతున్నాయనే సమాచారం వినిపిస్తోంది. ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా, వైస్ చైర్మన్ పదవి ఇతర వర్గానికి దక్కే అవకాశముంది.
Also Read: Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా ? పరగడుపున ఈ 5 జ్యూస్లు తాగండి !
ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి గెలుపొందిన బీసీ వర్గానికి చెందిన గుమ్మడిదల మహేశ్వరి రాజేష్, జనరల్ మహిళా స్థానంలో గెలిచిన మేకల రజిత దేవేందర్ రెడ్డి, మరో బీసీ స్థానంలో విజయం సాధించిన వచన్పల్లి అర్చన శ్రీనివాస్ పేర్లు వైస్ చైర్మన్ రేసులో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు మాత్రమే రావడంతో, బీజేపీతో కలిసినా మ్యాజిక్ ఫిగర్ చేరుకునే పరిస్థితి లేకపోవడం గమనార్హం. జాతీయ స్థాయి రెండు పార్టీలైన కాంగ్రెస్–బీజేపీ కలయికకు అవకాశం తక్కువేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.