AIR Travels: విమాన ప్రయాణికులకు చల్లటి కబురు చెప్పింది పౌర విమానయాన శాఖ. పెయిడ్ సీట్లు చెబుతూ ప్రయాణికులను అదనపు డబ్బులు తీసుకుంటున్న ఎయిర్లైన్స్కు చెక్ పెట్టింది. ఇకపై ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది.
విమాన ప్రయాణికులకు చల్లటి కబురు
విమానాల్లో ప్రయాణికుల సమస్యలపై ఫోకస్ చేసింది పౌర విమానయాన శాఖ. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత చెక్-ఇన్ సమయంలో నచ్చిన సీటు కోసం ప్రయాణికులు అదనంగా సంబంధిత ఎయిర్లైన్స్కు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. చాలామంది ప్రయాణికులకు ఆ తరహా సమస్య ఎదురైంది. కొన్నిసార్లు విమానంలో అన్నిసీట్లను పెయిడ్ సీట్లుగా చూపిస్తూ ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
రూ. 200 నుంచి రూ. 1500 వరకు వసూలు చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు లేవనెత్తారు. ఇకపై వాటికి చెక్ పెట్టింది ఆ శాఖ. ఈ వ్యవహారంపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదుల తలెత్తడంతో విమానాల్లో సీట్ల ఎంపికపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పౌర విమానయాన శాఖ తాజా ఉత్తర్వుల మేరకు ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలి.
సీట్ల విషయంలో ఆ పప్పులుడకవ్- పౌర విమానయాన శాఖ
ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకూడదు. మిగిలిన 40 శాతం సీట్లకు అదనపు ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటును ఎయిర్లైన్స్ సంస్థలకు కల్పించింది. అందులో ముందు వరుసలు, ఎక్కువ లెగ్ స్పేస్ ప్రీమియం సీట్లు వంటివి. ఈ వ్యవహారం పార్లమెంటరీ కమిటీ దృష్టికి వెళ్లింది. ఫలితంగా ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికులు వెబ్ చెక్-ఇన్ సమయంలో సీటును ఎంపిక చేయకపోయినా ఉచిత సీట్లు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు. ఎయిర్ పోర్టులో కౌంటర్ వద్ద సీటును కేటాయించాలని స్పష్టం చేసింది. ఒకే PNRపై ట్రావెల్ చేసే ప్రయాణీకులను విమానంలో కలిసి కూర్చోబెట్టాలని, వీలైతే పక్కపక్క సీట్లు ఇవ్వాలని పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ALSO READ: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయనపాడు, గుణదలలో శాటిలైట్ స్టేషన్లు
ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్జెట్ సహా అన్ని దేశీయ విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. అంతేకాదు నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలు విధించే అవకాశం ఉంది. పెంపుడు జంతువుల రవాణాకు సంబంధించి విమానయాన సంస్థలు స్పష్టమైన, పారదర్శకమైన విధానాలను రూపొందించాలని ఆ శాఖ తెలిపింది. ప్రయాణికులతోపాటు వారి తీసుకెళ్లే సంగీత వాయిద్యాల రవాణాను పారదర్శకంగా చేయాలని పేర్కొంది.