Indian Athletes Face Trouble: భువనేశ్వర్ లో జరిగిన ఇండియన్ ఇండోర్ ఓపెన్ కంబైన్డ్ ఈవెంట్స్ అండ్ పోల్ వాల్ట్ పోటీల్లో పాల్గొన్న ఐదుగురు అథ్లెట్లు సేలంకు తిరిగి వస్తుండగా ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రయాణ సమయంలో వారి ఖరీదైన పోల్ వాల్ట్ కర్రలు రైలులో నుంచి పడిపోవడంతో, ముగ్గురు అథ్లెట్లు కదులుతున్న రైలు నుంచి దూకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి రైల్వే స్టేషన్ లో జరిగింది.
భువనేశ్వర్ కు వెళ్లి వస్తున్న టీమ్ లో ముగ్గురు పోల్ వాల్టర్లు, ఇద్దరు హెప్టాథ్లెట్లు ఉన్నారు. రిజర్వేషన్ సమస్యల కారణంగా వారు రెండు వేర్వేరు కోచ్లలో ప్రయాణించారు. పోల్ వాల్ట్ గేమ్ లో ఉపయోగించే కర్రలు చాలా పొడవుగా ఉండటంతో, వాటిని కోచ్ లోపల పెట్టడానికి సరిపడా స్థలం లేకపోయింది. అందుకే, అథ్లెట్లు వాటిని కిటికీకి బలంగా కట్టేశారు. సాధారణంగా వారు ఫ్యాన్లకు కడతారు. కానీ, కోచ్ పూర్తిగా నిండిపోయి ఉండటంతో కిటికీలకు కట్టాల్సి వచ్చింది. ప్రయాణం మొదట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగింది. అయితే, రైలు రాజమండ్రి స్టేషన్ కు చేరుకోగానే అసలు కథ మొదలయ్యింది. ఒక ప్రయాణికుడు ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీస్ సిబ్బంది అక్కడికి వచ్చారు. పోల్స్ ను కట్టిన తాళ్లను కత్తిరించారు. ఆ సమయంలో రైలు కదలడం ప్రారంభించడంతో, ఖరీదైన పోల్స్ ట్రాక్పై పడిపోవడం మొదలైంది.
వెంటనే, అథ్లెట్ కవినరాజా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశాడు. అతని వెంట మరో ఇద్దరు అథ్లెట్లు కూడా దిగారు. అదే సమయంలో రైలులో ఉన్న మరో అథ్లెట్ ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైలు ఆగింది. అదృష్టవశాత్తూ, పోల్స్ పూర్తిగా దెబ్బతినకముందే వాటిని వారు తిరిగి తీసుకున్నారు. ఈ పోల్స్ ఒక్కొక్కటి లక్ష రూపాయలకు పైగా ఖరీదు చేస్తాయని అథ్లెట్లు తెలిపారు. తాము చాలా కష్టపడి ఈ పోల్స్ కొనుగోలు చేశామని.. అవి పాడైతే మళ్లీ కొనడం అంత సులభం కాదని కవిన్ చెప్పాడు.
ఈ ఘటన తర్వాత రైల్వే అధికారులు ముగ్గురు అథ్లెట్లను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తమ సామాను రైలులో ఉందని, కనీసం వాటిని తీసుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరినా అధికారులు అనుమతించలేదు. దీంతో వారి బ్యాగులు, ఇతర సామాను రైల్లోనే సేలంకు వెళ్లిపోయాయి. రైల్వే పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారని అథ్లెట్లు చెప్పారు. తమ పరిస్థితిని పదేపదే వివరించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. చివరకు శక్తి అనే అథ్లెట్ తాను భారతీయ రైల్వే ఉద్యోగినని గుర్తింపు కార్డు చూపించిన తర్వాత పరిస్థితి కొంత మారిందన్నారు. దాదాపు ఆరు గంటల పాటు విచారణ అనంతరం వారిని విడుదల చేశారు.
ఆ రాత్రే ముగ్గురు అథ్లెట్లు మరో రైలులో చెన్నైకి బయలుదేరారు. ఇదే తరహా సమస్యలు భారతీయ పోల్ వాల్టర్లకు గతంలో కూడా ఎదురయ్యాయని వారు గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితులు మళ్లీ మళ్లీ ఎదురైతే, యువ క్రీడాకారులను పోల్ వాల్ట్ లాంటి క్రీడల నుంచి దూరం చేసే ప్రమాదం ఉందని కవిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో అథ్లెట్లు తీవ్రంగా నిరుత్సాహానికి గురయ్యారు.
Read Also: ప్రపంచంలో తొలి లేడీస్ స్పెషల్ ట్రైన్.. స్ఫూర్తిదాయక ప్రయాణానికి 34 ఏళ్లు!