Vodafone Idea: భారత టెలికాం రంగంలో మూడో అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) కు సుప్రీంకోర్టులో కీలకమైన విజయం లభించింది. కేంద్ర ప్రభుత్వం తమకు చెల్లించాలని కోరిన రూ. 363 కోట్ల వస్తు సేవల పన్ను (GST) డిమాండ్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నిర్ణయంతో సంస్థకు చట్టపరమైన, ఆర్థికపరమైన అంశాల్లో పెద్ద ఊరట లభించినట్లయింది.
గతంలో వొడాఫోన్, ఐడియా సంస్థల విలీన ప్రక్రియ సమయంలో వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్ కు చెందిన టవర్ వ్యాపారాన్ని ఏటీసీ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయించారు. ఈ అమ్మకానికి సంబంధించి చెల్లించాల్సిన జీఎస్టీ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయలేదని కేంద్ర పన్నుల శాఖ ఆరోపించింది.
అయితే జస్టిస్ జేబీ పార్డీవాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. విలీనం తర్వాత ‘వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్’ అనే సంస్థ అసలు ఉనికిలోనే లేదని, ఉనికిలో లేని ఒక పాత సంస్థ నుంచి ప్రభుత్వం పన్ను ఎలా డిమాండ్ చేస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది.
అంతకుముందు బాంబే హైకోర్టు కూడా ఏప్రిల్ 29న ఇదే విధమైన తీర్పును వెలువరించింది. అప్పుడు బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం హైకోర్టు తీర్పుకే మొగ్గు చూపింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా సంస్థ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. రాబోయే నెలలు, సంవత్సరాలలో అనేక బకాయిలను ఆ సంస్థ చెల్లించాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో రూ. 363 కోట్ల అదనపు పన్ను భారం పడకపోవడం కంపెనీకి పెద్ద ఉపశమనమే అని చెప్పవచ్చు.
Also Read: రేవంత్ vs కేసీఆర్.. సామాజిక స్పృహపై మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
కాగా, తన నెట్వర్క్ పునర్నిర్మాణం, విస్తరణ కోసం వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 45,000 కోట్ల భారీ కేపెక్స్ (Capex) ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దీని కోసం బ్యాంకుల ద్వారా రుణాలు పొందడంతో పాటు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించే ప్రయత్నాల్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రమోటర్ ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతుతో సంస్థ తిరిగి పుంజుకునే దిశగా అడుగులు వేస్తుండటంతో, రాబోయే త్రైమాసికాలలో కంపెనీ ఎలా ఉండబోతుందనే దానిపై మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Also Read: మగ జీవులను నీచంగా చూసే.. భయంకరమైన ఆడ జంతువులు.. ఇవి చాలా డేంజర్ భయ్యా!