Normal Railway Tracks vs Bullet Train Tracks: దేశంలో సాధారణ రైళ్లు గంటకు 80 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కొన్ని సెమీ హైస్పీడ్ రైళ్లు 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. అయితే, బుల్లెట్ రైళ్లు మాత్రం గంటకు 300 నుంచి 350 కిలోమీటర్లకు పైగా దూసుకెళ్తాయి. ఇంత వేగంగా ప్రయాణించాలంటే కేవలం శక్తివంతమైన ఇంజిన్ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా ప్రత్యేకమైన పట్టాలు, ఆధునిక సాంకేతిక వ్యవస్థలు కూడా అవసరం.
మన దేశంలో సాధారణ రైలు పట్టాల కింద చిన్న రాళ్లు, సిమెంట్ స్లీపర్లు ఉంటాయి. ఇవి రైలు బరువును మోయడంలో సహాయపడతాయి. కానీ, రైళ్లు వెళ్లేటప్పుడు ఈ రాళ్లు కొంత కదులుతుంటాయి. బుల్లెట్ రైళ్ల విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వీటి కోసం రాళ్లకు బదులుగా బలమైన కాంక్రీట్ స్లాబ్ లను ఉపయోగిస్తారు. వీటిని స్లాబ్ ట్రాక్ లు అంటారు. ఇవి ఎక్కువ వేగంతో వచ్చే కంపనాలను తట్టుకుని పట్టాలు కదలకుండా ఉంచుతాయి.
సాధారణ రైల్వే మార్గాల్లో చాలా మలుపులు ఉంటాయి. తక్కువ వేగం కాబట్టి ఇది పెద్ద సమస్య కాదు. కానీ, బుల్లెట్ రైళ్లకు షార్ప్ మలుపులు ప్రమాదకరంగా మారతాయి. అందుకే బుల్లెట్ రైలు మార్గాల్లో మలుపులు చాలా విశాలంగా, పొడవుగా నిర్మిస్తారు. అలాగే మలుపుల వద్ద ప్రత్యేక కోణంలో పట్టాలను అమర్చి రైలుకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
మనం సాధారణ రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు లబ్-డబ్ అనే శబ్దం వినిపిస్తుంది. ఇది పట్టాల మధ్య ఉండే జాయింట్ల వల్ల వస్తుంది. బుల్లెట్ రైళ్లలో మాత్రం కిలోమీటర్ల పొడవునా పట్టాలను ఒకే భాగంలా వెల్డింగ్ చేస్తారు. దీంతో ఎలాంటి శబ్దం లేకుండా, షేక్ లేకుండా రైలు సాఫీగా ప్రయాణిస్తుంది.
బుల్లెట్ రైళ్ల పట్టాలను సాధారణ ఇనుముతో తయారు చేయరు. హై క్వాలిటీ కలిగిన ప్రత్యేక స్టీల్ను ఉపయోగిస్తారు. ఇది వేడి, ఒత్తిడిని సులభంగా తట్టుకోగలదు. అలాగే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అదే సమయంలో బుల్లెట్ రైలు మార్గాలు ఎక్కువగా భూమికి పైన పిల్లర్ల మీద, టన్నెల్స్ లో నిర్మిస్తారు. దీని వల్ల మనుషులు, జంతువులు,ఇతర వాహనాలు ట్రాక్ పైకి వచ్చే అవకాశం ఉండదు. దీంతో ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి. బుల్లెట్ రైలు ముందు భాగం చాలా పొడవుగా, పక్షి ముక్కును పోలి ఉంటుంది. ఈ డిజైన్ గాలి నిరోధకతను తగ్గించి అధిక వేగంతో సులభంగా ప్రయాణించేందుకు సహాయపడుతుంది.
ప్రస్తుత రైల్వే ట్రాక్లపై బుల్లెట్ రైలును నడపడం దాదాపు అసాధ్యం. కారణం, సాధారణ పట్టాలు భారీ వేగంతో వచ్చే కంపనాలను తట్టుకోలేవు. మలుపులు కూడా చాలా పదునుగా ఉంటాయి. అంతేకాకుండా, ప్రస్తుత సిగ్నలింగ్ వ్యవస్థ 300 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లకు సరిపోదు. బుల్లెట్ రైళ్ల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ఆధారిత ఆటోమేటిక్ ట్రైన్ కంట్రోల్ వ్యవస్థను ఉపయోగిస్తారు. డ్రైవర్ కు అవసరమైన సమాచారం నేరుగా క్యాబిన్లోనే కనిపిస్తుంది.
Read Also: అలా జరిగితే.. వందే భారత్ రైలులో ఫుడ్ ఫ్రీ, రైల్వే కీలక నిర్ణయం!