Hyderabad Bullet Train: బుల్లెట్ ట్రైన్.. ఎస్.. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్.. దేశంలో తొలి ప్రాజెక్ట్. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్ని వచ్చే ఏడాది ఆగస్టు 15లోగా అన్నీ పనులు పూర్తి చేసి ట్రైల్ రన్ కూడా వేసే దిశగా పనులు జరుగుతున్నాయి. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ గంటకు 320 నుండి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ తర్వాత ముంబై-హైదరాబాద్, ఢిల్లీ-హైదరాబాద్, చెన్నై-బెంగళూరు మధ్య కూడా హైస్పీడ్ రైలు కారిడార్లకు లైన్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్–పుణె–ముంబయి, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–చెన్నై కారిడార్ల మొత్తం పొడవు 2,028 కిలోమీటర్లు. ఇందులో తెలంగాణ పరిధిలోనే 512 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం జరగనుంది. దీంతో దేశ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల్లో తెలంగాణ కీలక భాగస్వామిగా మారనుంది.
ముంబై–హైదరాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన రూట్లో వికారాబాద్, శంకర్పల్లి, నార్సింగి, ప్రాంతాలు కీలకంగా మారే అవకాశముంది. ప్రయాణికుల డిమాండ్, భూసేకరణ, సాంకేతిక సాధ్యాసాధ్యాల ఆధారంగా అలైన్మెంట్ను ఖరారు చేయనున్నారు. ఈ కారిడార్ అమలైతే హైదరాబాద్కు హైస్పీడ్ రైలు అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంది. బుల్లెట్ ట్రైన్ వస్తే ప్రయాణమే కాదు.. పెట్టుబడుల వేగం కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వికారాబాద్, నార్సింగి పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు, రియల్ ఎస్టేట్, పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభించే అవకాశముంది.
మొత్తం మూడు కారిడార్లకు ఉమ్మడి కేంద్రంగా శంషాబాద్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడే ప్రధాన హైస్పీడ్ రైల్వే స్టేషన్, రోలింగ్ స్టాక్ డిపో, వర్క్షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 400 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ..భవిష్యత్ నగరాభివృద్ధికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇది కేవలం ఓ రైలు ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. భారత రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవానికి నాంది. బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే వేగవంతమైన ప్రయాణంతో పాటు పరిశ్రమలు, వ్యాపారం, పెట్టుబడులకు కూడా కొత్త జోష్ రానుంది.
Read Also: ఇండియా నుంచి చైనా, భూటాన్ వరకు రైళ్లు.. డోక్లాంలో రైల్వే ట్రాక్కు లైన్ క్లియర్!