Vande Bharat Delay Policy: వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) క్రేజీ న్యూస్ చెప్పింది. ఇకపై వందే భారత్ రైలు రెండు గంటలు, అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు తెలిపింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులు స్టేషన్లలో, రైల్లో అదనంగా ఫుడ్ కొనాల్సిన అవసరం లేకుండా ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది. ఇప్పటికే రాజధాని, శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో అమల్లో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు వందే భారత్ రైళ్లకు కూడా విస్తరించింది.
IRCTC వెల్లడించిన వివరాల ప్రకారం, టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ను సెలెక్ట్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఒకవేళ రైలు తన గమ్యస్థానానికి చేరుకోవడంలో రెండు గంటలకు పైగా ఆలస్యమైతే, వారికి ఉచితంగా భోజనం అందజేస్తారు. ఈ భోజనంలో సాధారణంగా అన్నం, పప్పు, ఊరగాయను వడ్డిస్తారు. రైలులోని ప్యాంట్రీ కార్ సిబ్బంది నేరుగా ప్రయాణికుల సీట్ల వద్దకే ఆహారాన్ని తీసుకెళ్లి అందిస్తారు. కొన్ని సందర్భాల్లో రైలులో భోజనం అందుబాటులో లేకపోతే, ప్రయాణికులకు ప్యాక్డ్ ఫుడ్ లేదంటే ముందుగానే సిద్ధం చేసిన భోజన ప్యాకెట్లు అందిస్తారు. ఎలాగైనా ప్రయాణికులు ఆకలితో ఇబ్బంది పడకుండా చూసే ప్రయత్నం చేస్తోంది IRCTC.
ఇటీవల కొన్ని పనుల కారణంగా ఒక వందే భారత్ రైలు రెండు గంటలకు పైగా ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తమకు ఆహారం అందించాలని కోరారు. అనంతరం వారికి ఉచితంగా భోజనం అందించారు. ఈ ఘటన తర్వాత ఉచిత భోజన సౌకర్యంపై మరింత స్పష్టత వచ్చింది. ఈ నిబంధన దేశంలోని అన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు వర్తించనుంది. ముఖ్యంగా బీహార్ లో నడిచే గోరఖ్పూర్-పాట్లీపుత్ర-గోరఖ్పూర్, జోగ్బానీ-దానాపూర్ వందే భారత్ రైళ్లలో కూడా ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం వారికి ఉపశమనం కలిగించనుంది.
ఈ సదుపాయాన్ని పొందాలంటే టికెట్ బుక్ చేసేటప్పుడు ఫుడ్ ఆప్షన్ ను తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒకవేళ ప్రయాణికుడు ఆప్షనల్ మీల్ ను ఎంపిక చేయకపోతే, రైలు ఆలస్యమైనా ఉచిత భోజనం పొందే అవకాశం ఉండదు. అలాంటి ప్రయాణికులు విడిగా ఆహారం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిర్ణయం వల్ల రైలు ఆలస్యమైన సందర్భాల్లో ప్రయాణికులపై అదనపు ఖర్చు భారం తగ్గుతుంది. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారికి ఈ సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. రైలు ఆలస్యమైనా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో IRCTC తీసుకున్న ఈ నిర్ణయం వందే భారత్ ప్రయాణికులకు మంచి ఉపశమనంగా మారనుంది.