IndiGo Flights Reduce: దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలలో గందరగోళానికి కారణమైన ఇండిగోపై కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు విమానయాన నియంత్రణ సంస్థ అయిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) కీలక ప్రకటన చేసింది. ఇండిగో వింటర్ షెడ్యూల్ ను తగ్గించడంతో పాటు ఆ కంపెనీకి చెందిన విమానాల సంఖ్యను 5 శాతం తగ్గించింది. ఇండిగో రోజుకు దాదాపు 2,200 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతుంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 110 విమానాలు తగ్గనున్నాయి. ఈ విమానయాన సంస్థకు సంబంధించి ఖాళీ అయిన స్లాట్ లను ఇతర సంస్థలకు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
గత వారం రోజుల నుంచి కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇండిగోకు ఆమోదించిన వింటర్ షెడ్యూల్ను పరిశీలించామని, ఈ సమయంలో ప్రతిరోజూ వందలాది ఇండిగో విమానాలు రద్దు అయినట్లు గుర్తించామని తెలిపింది. వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో చిక్కుకుపోయారని తెలిపింది. “DGCA జారీ చేసిన శీతాకాల షెడ్యూల్ (WS) 2025 ప్రకారం, ఇండిగో వారానికి దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల నుంచి 15,014 సర్వీసులు నడవాల్సి ఉంది. నవంబర్ 2025 నెలకు 64,346 విమానాలు నడిపేందుకు ఆమోదం ఉంది. కానీ, ఇండిగో సమర్పించిన ఆపరేషనల్ డేటా ప్రకారం, నవంబర్ 2025లో 59,438 విమానాలు నడిపింది. ఆ నెలలో 951 విమానాల రద్దు అయ్యాయి” అని DGCA తెలిపింది.
“SS24తో పోల్చితే SS25లో 6 శాతం విమానాల పెంపును ఇండిగో పొందింది. కానీ, విమానాలను నడిపే విషయంలో ఫెయిల్యూర్ అయ్యింది. ఈ షెడ్యూల్లను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని ఎయిర్లైన్ ప్రదర్శించలేదు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ను 5% తగ్గించాలని, ముఖ్యంగా అధిక డిమాండ్, అధిక ఫ్రీక్వెన్సీ విమానాలలో సింగిల్ ఫ్లైట్ కార్యకలాపాలను నివారించాలని ఆదేశించబడింది” అని DGCA తెలిపింది.
తాజాగా సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేసిన ఎయిర్లైన్పై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొత్త భద్రతా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత వారం రోజులుగా వందలాది విమానాలు రద్దు కావడం ఇండిగో అంతర్గత సంక్షోభం ఫలితంగానే జరిగిందన్నారు. ” ప్రయాణీకులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మేము పరిస్థితిని తేలికగా తీసుకోవడం లేదు. కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని చేసి చూపిస్తాం” అని నాయుడు వెల్లడించారు.
Read Also: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!
రోజుకు 2,200 విమానాలను నడుపుతూ, సాంప్రదాయకంగా డౌన్ టైమ్ను తగ్గించడంపై దృష్టి సారించిన ఇండిగో, కొత్త నిబంధనలు అమలులోకి రావడంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీని ఫలితంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో, విమానయాన నియంత్రణ సంస్థ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొత్త నిబంధనలను తాత్కాలికంగా సడలించింది.
Read Also: ఇండిగో దొంగ సాకులు? డీజీసీఏ షోకాజ్ నోటీసులకు ఏం సమాధానం ఇచ్చిందంటే?