Go Fall in Love: విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాడంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తాయి. యువతకు విద్యాబుద్దులు నేర్పి భావి పౌరులను తీర్చిదిద్దుతాయి. సెలవులు వస్తే చక్కగా చదువుకోవాలని సూచిస్తుంటాయి. కానీ, ఓ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో చర్చకు కారణం అయ్యింది. ఇంతకీ ఆ యూనివర్సిటీ చేసిన పని ఏంటంటే..
చైనాలో వివాహాలను పెంచాలనే ఉద్దేశంతో డ్రాగన్ సర్కారు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నది. జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఎలాగైనా పెంచాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఓ చైనా విశ్వవిద్యాలయం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను ప్రేమలో పడాలని ప్రోత్సహిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు చైనాలో వసంతకాలపు సెలవులను ఇవ్వనున్నారు. ఈ సమయంలో “పువ్వులను చూడండి, ప్రేమను ఆస్వాదించండి” అని ప్రచారం మొదలుపెట్టింది. సిచువాన్ సౌత్ వెస్ట్ వొకేషనల్ కాలేజ్ ఆఫ్ ఏవియేషన్ తన అధికారిక వీచాట్ అకౌంట్ లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రతి ఏటా సంప్రదాయంగా వేసవి, శీతాకాల సెలవులతో పాటు విద్యాలయాలకు వసంత, శరత్కాలపు సెలవులను కూడా ప్రవేశపెడతామని చైనా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సదరు యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పుస్తకాలు పక్కన పెట్టాలని సూచిస్తూ ఈ ప్రకటన చేసింది. ప్రేమలో మునిగితేలాలని పిలుపునిచ్చింది. సిచువాన్, తూర్పు జియాంగ్సు లాంటి ప్రావిన్సులు, సుజౌ, నాన్జింగ్ లాంటి నగరాలు వసంతకాలపు సెలవుల కోసం ఇప్పటికే ప్రణాళికలను వెల్లడించాయి.
చైనాలో ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణ, వినోద కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచాలని చైనీస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరింత తీరిక సమయాన్ని అందించడం ద్వారా యువతను ప్రేమలో పడేలా చేయాలని, ఫలితంగా వివాహాలను పెంచాలని భావిస్తోంది. 2025లో జననాల రేటు భారీగా పడిపోయింది. జనాభా వరుసగా నాలుగో ఏడాది కూడా తగ్గింది. ఇది మరింత క్షీణతకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు. మళ్లీ జనాభా పెంచాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పిల్లలకు అనుకూలమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి బీజింగ్ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. జాతీయ అభివృద్ధి, సంస్కరణల కమిషన్ (NDRC) వీటిని రీలీజ్ చేసింది.
Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?
విద్య, ఆరోగ్యం నుంచి ప్రయాణం, క్రీడలు, వినోదం వరకు వివిధ రంగాలలో ప్రజా సేవలను మెరుగుపరచడం ద్వారా పిల్లలకు అనుకూలమైన నగరాలను తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు సూచనలు చేసింది. పిల్లలను పెంచడానికి సమాజానికి తగినంత సమయం, డబ్బు ఉండాలని చైనా ట్రావెల్ కంపెనీ ట్రిప్ సహ వ్యవస్థాపకుడు జేమ్స్ లియాంగ్ అన్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో చర్చకు కారణం అయ్యింది. కొంత మంది ప్రభుత్వం నిర్ణయానికి అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుందని కొంత మంది నెటిజన్లు అంటే, ఇదేం విచిత్రం అని మరికొంత మంది పెదవి విరుస్తున్నారు.
Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?