HYDRAA: స్వేచ్ఛ, బ్యూరో: నగరంలో మరో మూడెకరాల సర్కారు భూమిని హైడ్రా బుధవారం కాపాడింది. నగరం నడిబొడ్డున ఖైరతాబాద్ మండలం వెంగళరావునగర్ లో 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా మరో బిగ్ ఆపరేషన్ నిర్వహించి, ఎట్టకేలకు కబ్జాల పాలైన భూమికి విముక్తి కల్గించింది. కాపాడిన ఈ భూమి విలువ మార్కెట్ లో సుమారు రూ. 600ల కోట్ల వరకూ ఉంటుందని అంచనాలున్నాయి. 1975 కంటే ముందే సంబంధిత వ్యక్తులకు పరిహారమిచ్చి 45 ఎకరాల భూమని హౌజింగ్ బోర్డు సేకరించింది. మొత్తం 660 ప్లాట్లతో లే ఔట్ వేసింది. ఇందులో పార్కుల కోసం కొన్ని స్థలాలను కేటాయించింది. వెంగళరావునగర్ ప్రధాన రహదారికి ఆనుకుని ప్రజావసరాలకోసం 5 ఎకరాల స్థలాన్ని ఖాళీగా ఉంచింది. ఇందులో ఇప్పటికే 2 ఎకరాల భూమిలో శాశ్వత కట్టడాలు వచ్చాయి.
వాటి జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 3 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హౌజింగ్ బోర్డు నుంచి గతంలో పరిహారం తీసుకున్నవారితో పాటు మరో 3 గ్రూపులు ఈ భూమి తమదిగా చెబుతూ ఆక్రమణలకు పాల్పడిన వారితో హైడ్రా ఇదివరకే సమావేశం ఏర్పాటు చేసింది. ఎవరి వద్దా సరైన పత్రాలు లేవని నిర్ధారించింది. ఇదే సమయంలో ఆ ఖాళీ స్థలం తమదిగా పేర్కొంటున్న వారు హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే కొనసాగుతున్నప్పుడు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదనే నిబంధనలు పట్టించుకోకుండా, అందులో కొత్తగా షెడ్డులు వేయడం, గుడిసెలు నిర్మించడం, వివిధ రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ రావడంపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా బుధవారం ఆక్రమణలను తొలగించింది. 3 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి, ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. తొలుత అక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వారు తాము రెండు తరాలుగా ఇక్కడే జీవిస్తున్నామంటూ హైడ్రా ను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, వారి వాహానాల్లో ఎక్కించుకుని తరలించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది.
Also Read: KTR: 57వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రహ్మతుల్లా నుంచి 45 ఎకరాల భూమిని కొని హౌజింగ్ బోర్డు లే ఔట్ వేపింది. ఈ లే ఔట్లో 5 ఎకరాల భూమిని ప్రజావసరాలకోసం ఖాళీగా ఉంచింది. హౌజింగ్ బోర్డు వారు లే ఔట్ వేసినప్పటికే గుడెసెలు ఉన్న 2 ఎకరాల భూమిని అక్కడ ఉన్న వారికి ఇచ్చేయాలని సుప్రింకోర్టు ఆదేశించింది. ఈ మేరకు వారికి కేటాయించడం జరిగింది. ఇంకా మిగిలి ఉన్న 3 ఎకరాల భూమి చుట్టూ కబ్జాల కథలు నడుస్తున్నాయి. సుప్రిం కోర్టు ఆదేశాలమేరకు గుడిసెల వారు సొంతం చేసుకున్న 2 ఎకరాల భూమిని అక్కడ నివాసితుల ప్రతినిధిగా జీపీఏ తీసుకుని రామస్వామి అమ్మేశాడు. అక్కడికే పరిమితం కాకుండా ఆ పక్కనే మిగిలిన 3 ఎకరాల భూమిపై కూడా రామస్వామి అతని వారసుల కన్ను పడింది. రామస్వామితో పాటు ఆయన వారసుల ప్రయత్నాలు ఇలా ఉంటే, ఈ భూమిని తమకు జాగీర్దార్ లక్ష్మణరావు అమ్మారంటూ డేవిడ్ రాజు, దేవసహాయం (అన్నదమ్ములు) తప్పుడు పత్రాలతో తమదిగా చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా జాగీర్దార్ లక్ష్మణరావుకు చెందినదిగా లేదు.
హౌజింగ్ బోర్డుకు గతంలో అమ్మిన రహ్మతుల్లా వారసులు తమకు అమ్మారని, మహారాష్ట్రలోని లాథూర్లో ఉన్న వారి వద్ద జీపీఏ కుదుర్చుకున్నామని ఆర్కేవీ సంస్థకు చెందిన ప్రతినిధులు గోపీనాథ్, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఇదే వారసులు తమకు అమ్మారని కె. రాజేష్ అనే వ్యక్తి చెబుతూ వస్తున్నారు. వీరందరి వెనుకా వివిధ పార్టీలకు చెందిన రాజకీయనాయకులున్నారనే వాస్తవాన్ని హైడ్రా గుర్తించింది. ఇదిలా ఉండగా, ఈ భూమి తమదిగా పేర్కొంటున్న వారందరితో హైడ్రా సమావేశం ఏర్పాటు చేసింది. వారి వద్ద ఉన్న పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఎవరూ సరైన పత్రాలు చూపించలేకపోయారు. ఎవరికి వారు హైకోర్టుకు గతంలో వెళ్లగా, కోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని పట్టించుకోకుండా అక్కడ కొత్తగా గుడిసెలు వేయడం, పలు షెడ్డులు నిర్మించడంతో పాటు వ్యాపారాలకు అడ్డాగా మార్చుకున్నారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి బుధవారం ఆక్రమణలు తొలగించింది.
Also Read: Cucumber: చేదులేని కీరా దోసకాయను ఇలా ఎంపిక చేసుకోండి