GHMC Commissioner: స్వేచ్ఛ, బ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని మెయిన్ రోడ్లు ఉదయం తొమ్మిదిన్నర గంటల కల్లా క్లీన్ కావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా శానిటేషన్ పనులు ఎఫెక్టుగా నిర్వహించేలా ఫోకస్ పెట్టాలని కూడా సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన శానిటేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత గా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి రోజు ఉదయం తొమ్మినదిన్నర గంటల కల్లా మెయిన్ రోడ్లన్నీ చెత్త పూర్తిగా తొలగించి, క్లీన్ గా కన్పించాలని స్పష్టం చేశారు.
ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈలపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఉదయం పది గంటల తర్వాత ప్రధాన రహదారులపై క్లీనింగ్ కార్యకలాపాలు కనిపించకుండా ముందస్తు ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శానిటేషన్ బాధ్యత ప్రధానంగా డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈలదేనని ఆయన స్పష్టం చేశారు. గ్రీన్ వెస్ట్ తొలగింపు బాధ్యతను కూడా ఇకపై ఎస్డబ్ల్యూఎం విభాగమే నిర్వహించాలని తెలిపారు.
సీఅండ్ డీ వ్యర్థాలు, దీర్ఘకాలంగా పేరుకుపోయిన చెత్త, గ్రీన్ వెస్ట్ను వేగంగా తొలగించేందుకు అదనపు వాహనాలు సమకూరుస్తామని వెల్లడించారు. పారిశుద్ధ్యం పై మీడియాలో వచ్చే నెగెటీవ్ వార్తలపై క్విక్ రెస్పాన్స్, యాక్షన్ ఉండాలన్నారు. ఉద్యోగులకు వేతనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ (శానిటేషన్ ) రవికిరణ్, జోనల్ కమిషనర్లు ప్రియాంక అలా, మందా మకరందు, ముకుందారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు, ఎస్డబ్ల్యూఎం డీఈఈలు, రాంకీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: Tirumala steps: తిరుమల మెట్లు ఎక్కేటప్పుడు ఆ నియమాలు తప్పకుండా పాటించాలట