ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం అంతా అల్లకల్లోలంగా మారింది. ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని చనిపోవడంతో ఇరాన్ నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. మిడిల్ ఈస్ట్ లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్స్ కు దిగుతుంది. మొత్తంగా పశ్చిమాసియా ప్రాంతం అంతా మిసైల్స్ మోతలతో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇప్పుడిప్పుడే విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయి. యుద్ధం కారణంగా భారత్ నుంచి అత్యంత రద్దీగా మార్గాల్లో ఒకటైన లండన్కు నాన్ స్టాప్ విమానాలు కూడా తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
పశ్చిమాసియా ఎయిర్ స్పేస్ లో కొన్ని ప్రాంతాలు మూసివేయడంతో పలు విమానయాన సంస్థలు విమానాలను దారి మళ్లించడంతో పాటు మరికొన్ని సర్వీసులను రద్దు చేశాయి. ఇరాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలపై ఉన్న కీలక కారిడార్లను మూసివేయడంతో దక్షిణాసియా, యూరప్ మధ్య రాకపోకలు కొనసాగించే విమానాలపై ఎఫెక్ట్ పడింది. మొత్తంగా భారతీయ ట్రావెల్ నెట్ వర్క్ తీవ్ర కుదుపులకు లోనయ్యింది.
మార్చి 8 వరకు ఢిల్లీ నుంచి లండన్ కు రెగ్యులర్ నాన్ స్టాప్ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. విమానాలను సుదూర ప్రాంతాల మీదుగా వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కువ ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు విమాన సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లో ఢిల్లీ నుంచి లండన్ కు నాన్ స్టాప్ విమానాలు మార్చి 9 నుంచి అందుబాటలో ఉన్నాయి.
అటు ఢిల్లీ నుంచి లండన్ కు వన్ వే ప్రయాణానికి రూ. 6 లక్షలు, అంతకంటే ఎక్కువ ఛార్జీలు ఉన్నట్లు విమానయాన సంస్థల వెబ్ సైట్ లలో కనిపిస్తున్నాయి. ఈ మార్గంలో కీలక విమానయాన సంస్థ అయిన వర్జిన్ అట్లాంటిక్, మార్చి 10 వరకు ఢిల్లీ నుంచి లండన్కు నాన్ స్టాప్ విమానాలు అందుబాటులో లేవని చూపిస్తుంది. ఆ తర్వాత కూడా, ఛార్జీలు రూ. 7,59,695 వరకు ఉన్నాయి.
డైరెక్ట్ ప్రయాణానికి రూ. 6 నుంచి 7 లక్షలు చెల్లించలేని వారు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో వెళ్లాలి అనుకునే వాళ్లు మూడు స్టాప్లతో కూడిన రూట్లలో వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రయాణ సమయం కూడా 31 గంటల వరకు పడుతుంది. నేరుగా వెళ్లే విమానాలకు 9 నుంచి 10 గంటల సమయం పడుతుంది. ఖతార్ ఎయిర్వేస్ న్యూఢిల్లీ నుంచి దోహా మీదుగా లండన్ కు వన్ స్టాప్ రూట్ ను అందిస్తోంది. ఈ మార్గంలో టికెట్ ధర రూ. 1,40,859గా ఉంది.
మొత్తంగా భారతీయ ప్రయాణీకుల మీద ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది. అత్యవసర ప్రయాణాలు కలిగిన బిజినెస్ మ్యాన్స్, విద్యార్థులు, కుటుంబ సభ్యులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఎక్కువ డబ్బులు చెల్లించి ప్రయాణించాల్సి వస్తుంది.
Read Also: ప్రయాణీకులకు కాస్త రిలీఫ్, దుబాయ్ నుంచి ఇండియాకు విమాన సర్వీసులు ప్రారంభం!