Baby Born in Running Train: ఆంధ్రప్రదేశ్ లో ఓ అరుదైన ఘటన జరిగింది. ప్రయాణంలో ఉన్న గర్భిణీకి రైల్వే సిబ్బంది పురుడు పోశారు. తల్లి, బిడ్డను కాపాడారు. ఈ ఘటన ఏప్రిల్ 5న అలప్పుజ-ధన్ బాద్ ఎక్స్ ప్రెస్ లో జరిగింది. రైల్వే సిబ్బందిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రైలు నంబర్ 13352లోని బి1 కోచ్ లో తన కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణీకి, అన్నవరం స్టేషన్ దాటిన కొద్దిసేపటికే పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. సదరు మహిళ పరిస్థితి సీరియస్ అయ్యింది. రన్నింగ్ ట్రైన్ లో ఏం చేయాలో తెలియని కుటుంబ సభ్యులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే, బ్యూటీలో ఉన్న టీటీఐ జ్యోతి స్పందించారు. పరిస్థితిని అర్థం చేసుకుని, రైలులోనే ప్రసవం సురక్షితంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో కమర్షియల్ కంట్రోలర్ తో మాట్లాడి నెక్ట్స్ స్టేషన్ లో 108 అంబులెన్స్ ను ఏర్పాటు చేయించారు.
మహిళ ప్రసవ వేదన పడటంతో, రైలును సమీపంలోని ఎలమంచిలి స్టేషన్లో ప్రత్యేకంగా ఆపేలా ఏర్పాట్లు చేశారు. రైల్వే సిబ్బంది అందరూ కలిసి అప్పటికే సదరు మహిళకు రైల్లోనే ప్రసవం చేశారు. ఆ తర్వాత తల్లి, బిడ్డను సురక్షితంగా అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. రైల్వే స్టేషన్ నుంచి వారిని ఎలమంచిలిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో వైద్యులు వెంటనే చికిత్స అందించి, తల్లి, ఆడబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించారు. వైద్యుల మాట విని కుటుంబ సభ్యులతో పాటు ప్రసవంలో సాయం చేసిన రైల్వే సిబ్బంది కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రసవానికి సంబంధించి జ్యోతితో పాటు బిపుల్ కుమార్, జుబేర్ ఖాన్ సహా ఇతర రైల్వే సిబ్బంది కీలక పాత్ర పోషించారు. వారి సహకారం లేకపోతే ఈ ప్రసవం సాఫీగా కొనసాగేది కాదని జ్యోతి చెప్పుకొచ్చారు.
అటు ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పందించింది. తమ సిబ్బంది చూపిన మానవత్వం, సేవాభావాన్ని ప్రశంసించింది. ప్రయాణీకుల భద్రత, సౌకర్యం కోసం తాము ఎప్పుడూ ముందుంటామని చెప్పింది. అటు ఈ ఘటనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రైల్వే సిబ్బంది అంతా కలిసి పని చేయడం వల్లే తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రైలులో ప్రయాణిస్తున్నకుటుంబానికి, సహాయం చేసిన సిబ్బందికి మరచిపోలేని అనుభవంగా మిగిలిపోయింది.
Read Also: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!