Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతో ఎలాంటి పొత్తులు ఉండబోవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టంచేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి మూడు మేయర్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు ఉన్నాయన్నారు. నాయకులపై, పార్టీపై ఇతరుల వద్ద మాట్లాడేటప్పుడు.. సోషల్ మీడియాలో కాకుండా ఏది ఉన్నా ఇంటర్నల్ గా మాట్లాడుకుందామని సూచించారు. అందరం ఏకమై ముందుకు పోదామని స్పష్టంచేశారు. తాను కూడా అందరిలాగే ఒక కార్యకర్తనని చెప్పారు. 1980 నుంచి ఇప్పటి వరకు ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు కాబట్టే అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పాలన.. బీజేపీ పాలనను పోల్చుకుని చూడాలన్నారు. నైతిక విలువలతో రాజకీయాల్లోకి వచ్చామని, సేవాభావంతో రాజకీయాల్లో ఉన్నామని చెప్పారు. అందుకే సేవా అంటే సంఘటన్.. సంఘటన్ అంటే సేవగా పేరొందిందని గుర్తుచేశారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని వివరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా పాలన సాగుతుందని వెల్లడించారు. పార్టీ ఎదిగిందంటే కార్యకర్తలు, నాయకుల కష్టమేనని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతం, పార్టీ కోసం పని చేసేవాళ్లను చూసి నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం.. రాష్టానికి ఎంతో సహకారం అందిస్తోందన్నారు. జాతీయ రహదారులు ఎవరి హయాంలో ఎక్కువ వచ్చాయో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణలో రావాల్సిన అవసరముందన్నారు. కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. రెండు పార్టీల పాలన చూశారు కాబట్టే.. నాయకులు, కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. అంతా కలిసి మెలిసి పనిచేద్దామని, బాధ్యత కొందరికి ముందు.. కొందరికి తరువాత వస్తాయని సూచించారు.
Also Read: కానిస్టేబుల్ కళ్ళముందే దారుణం.. భార్యను అతి దారుణంగా హత్య చేసిన భర్త
అనంతరం హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీజేపీ కంటే ముందు జన సంఘ్ పార్టీగా ఉండేందన్నారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. 1977లో ఎన్నికలు ప్రకటించారని, ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేశాయని, ఆ సమయంలో తాను జైలులో ఉన్నట్లు చెప్పారు. ఇందిరాగాంధీని ఆ సమయంలో ఓడించడం కష్టమని అనుకున్నారని, కానీ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అన్ని పార్టీలు ఏకమవ్వడంతో ఆ గాలిలో ఇందిరాగాంధీ కొట్టుకుపోయారన్నారు. ఇకపోతే రాజకీయ చిత్రపటంలో ఇక బీజేపీ ఉండదని కొందరు అనుకున్నారని, కానీ కార్యకర్తలు కష్టపడి 1998లో అటల్ బిహారీ వాజ్ పేయ్ ని ప్రధానిగా చేశారన్నారు. ఇప్పుడు 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడం విశేషమన్నారు. పదవుల కోసం పోరాడే పార్టీ బీజేపీ కాదన్నారు. రాజకీయాల్లో ముఖ్యమైనది నైతిక విలువలు కలిగి ఉండడమేనని దత్తాత్రేయ చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.
బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు మాట్లాడుతూ.. ఇతర పార్టీ కార్యకర్తలు భిన్నంగా ఉంటారని, కానీ బీజేపీ కార్యకర్తలు విలక్షణమైనవారని పేర్కొన్నారు. బీజేపీ సిద్ధాంతాలు దేశంలో నడవవు భావించారని, బీజేపీకి భవిష్యత్ ఉంటుందా అని చర్చించునేవారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ముందున్న ఏకైక పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రతిపక్షంలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషించిందన్నారు. రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండకూడదని చెప్పిన పార్టీ బీజేపీ అని వెల్లడించారు. కాంగ్రెస్.. నక్సల్స్ తో కలిసి పనిచేసిందని మురళీధర్ రావు విమర్శించారు.
ఇదిలా ఉండగా రాంచందర్ రావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఫోన్ చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కావాలని ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీర్వాదం కోసం ఇంటింటికీ వెళ్లాలని సూచించినట్లు రాంచందర్ రావు వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్న నమ్మకం తనకుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రధాని మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నితిన్ నబీన్.. రాంచందర్ రావుకు సూచించారు.
Also Read: దళపతి విజయ్ని టార్గెట్ చేశారా? TN 2026’రిలీజ్ ముందే పెద్ద వివాదం!