విమానయాన సంస్థలు ప్రయాణికుల విషయంలో అలసత్వం వహిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే అర్థం అవుతోంది. కేరళకు చెందిన ఓ రైతు తీసుకువెళ్తున్న అరుదైన హైబ్రిడ్ పనస మొక్క విమాన ఆలస్యం కారణంగా దెబ్బతినడంతో, అతనికి రూ.90,750 నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఎయిర్ ఏషియాను ఆదేశించింది. విమానయాన సంస్థ సర్వీసులలో నిర్లక్ష్యం కారణంగానే రైతుకు నష్టం కలిగిందని కమిషన్ స్పష్టం చేసింది.
పాలక్కాడ్ జిల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్ అనే రైతు ప్రత్యేక హైబ్రిడ్ పండ్ల సాగు, పరిశోధన చేస్తున్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో పెంచేందుకు ప్రత్యేక జాతికి చెందిన హైబ్రిడ్ పనస మొక్కను కొనుగోలు చేయడానికి 2025 ఆగస్టులో ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడ నుంచి ఆ మొక్కను తీసుకుని తిరిగి భారత్ కు రావడానికి ఎయిర్ ఏషియా విమానాలను బుక్ చేసుకున్నారు. ఆగస్టు 30న ఇండోనేషియాలోని మేడాన్-క్వాలానము నుంచి కౌలాలంపూర్ మీదుగా కొచ్చికి చేరుకోవాల్సి ఉంది. అయితే, తొలి విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో, కొచ్చికి వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ ను ఆయన మిస్ అయ్యారు. దీంతో కౌలాలంపూర్ విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు.
తన వెంట తీసుకువెళ్తున్న హైబ్రిడ్ పనస మొక్క చాలా సున్నితమైనదని, ఎక్కువసేపు ప్రయాణంలో ఉంటే దెబ్బతింటుందని అబ్దుల్ ఎయిర్ఏషియా అధికారులకు వివరించారు. అవసరమైతే అదనపు చార్జీలు కూడా చెల్లిస్తానని చెప్పి వెంటనే మరో విమానం ఏర్పాటు చేయాలని కోరారు. అయితే, కొచ్చికి వెళ్లే తదుపరి విమానం మూడు రోజుల తర్వాత మాత్రమే ఉంటుందని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ, వారు చెప్పిన మాట్లల్లో నిజం లేదని కమిషన్ గుర్తించింది. ఎందుకంటే, అబ్దుల్ అజీజ్ స్వయంగా మరో ఎయిర్ ఏషియా విమానానికి టికెట్ బుక్ చేసుకుని ఆగస్టు 31నే కొచ్చికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన టికెట్ ను కూడా ఆయన కమిషన్ ముందు సమర్పించారు.
ఆలస్యం కావడంతో అబ్దుల్ తీసుకొచ్చిన హైబ్రిడ్ పనస మొక్క పూర్తిగా దెబ్బతింది. దీంతో మొక్కను కొనుగోలు చేసిన డబ్బులు, ప్రయాణ ఖర్చులు, సమయం వృథా అయిందని వాదించారు. మరోసారి అదే మొక్కను కొనుగోలు చేయాలంటే మళ్లీ ఇండోనేషియాకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కేసులో ఎయిర్ ఏషియాకు నోటీసులు పంపించినప్పటికీ సంస్థ తరఫున ఎవరూ కమిషన్ ఎదుట హాజరు కాలేదు. ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో కమిషన్ ఏకపక్షంగా విచారణ చేపట్టి రైతు సమర్పించిన ఆధారాలను పరిశీలించింది.
విచారణ అనంతరం విమాన ఆలస్యం, కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ కావడం సంస్థ సేవల్లో లోపం కారణంగానే జరిగిందని కమిషన్ తేల్చింది. రైతుకు కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని టికెట్ రీఫండ్గా రూ.30,750, ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చుల కోసం రూ.25,000, మానసిక వేదనకు పరిహారంగా మరో రూ.25,000, కేసు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.90,750ను 45 రోజులలోగా చెల్లించాలని, లేకపోతే తుది చెల్లింపు వరకు ప్రతి నెలా అదనంగా రూ.500 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది.
Read Also: హైదరాబాద్ దగ్గరే మసాయి మారా అనుభూతి.. మోకిలలో కొత్త సఫారీ స్టేకేషన్!