Hydrogen Powered Train in India: భారతీయ రైల్వే మరో అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు విజయవంతంగా సేవలు అందిస్తూ, 1,200 కిలోమీటర్లకు పైగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. జూలై 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ నుంచి ఈ రైలును ప్రారంభించారు. ప్రస్తుతం ఇది జింద్-సోనిపట్ మార్గంలో నడుస్తోంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే ఢిల్లీ మార్గంలో కూడా ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు రైల్వే సిద్ధమవుతోంది.
హైడ్రోజన్ రైలుకు సంబంధించి రైల్వేశాఖ తాజాగా కీలక వివరాలు వెల్లడించింది. ఈ హైడ్రోజన్ రైలు ఇప్పటివరకు సుమారు 3,200 లీటర్ల డీజిల్ వినియోగాన్ని ఆదా చేసింది. సాధారణ డీజిల్ ఇంజిన్లతో పోలిస్తే ఇది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించే దిశగా కీలక అడుగు పడిందంటున్నారు.
ఈ రైలు పని చేసే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణ రైళ్లలో డీజిల్ ను మండించి శక్తిని ఉత్పత్తి చేస్తారు. కానీ, హైడ్రోజన్ రైలులో ఫ్యూయల్ సెల్ సాంకేతికతను ఉపయోగిస్తారు. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ తోనే రైలు మోటార్లు పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో పొగ, కార్బన్ ఉద్గారాలు బయటకు రావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే వస్తుంది. అందుకే దీన్ని పర్యావరణహిత రవాణా వ్యవస్థగా పిలుస్తారు.
ఈ హైడ్రోజన్ రైలును పూర్తిగా భారతీయ రైల్వే స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. ఇందులో 10 ప్రయాణికుల కోచ్లు, రెండు హైడ్రోజన్ పవర్ కార్లు ఉన్నాయి ఇవి 2,400 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలను కూడా ఇందులో వినియోగించారు. ఇవి విద్యుత్ వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడంతో పాటు రైలు పనితీరును మరింత మెరుగుపరుస్తాయి.
ఈ ప్రాజెక్ట్ కోసం హర్యానాలోని జింద్లో ప్రత్యేక హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 3,000 కిలోల గ్రీన్ హైడ్రోజన్ను నిల్వ చేసే సామర్థ్యం ఉంది. హైడ్రోజన్ను అధిక పీడనంతో భద్రపరిచి, అవసరమైన సమయంలో రైలుకు సరఫరా చేసే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
జింద్-సోనిపట్ మార్గంలో హైడ్రోజన్ రైలు ప్రయాణం విజయవంతం అయిన నేపథ్యంలో.. ఢిల్లీ రూట్లో కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. భవిష్యత్తులో దేశంలోని మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్, కాలుష్య రహిత రవాణా వ్యవస్థ వైపు భారత్ వేస్తున్న మరో కీలక అడుగుగా నిలిచింది.
Read Also: చైనా రైలు టికెట్ ధరలు చూస్తే, ఇండియన్ రైల్వేకు సెల్యూట్ చేయడం పక్కా.. ఎందుకంటే!