Komuravelli Railway Station Inaugurated: ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో నూతన రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీలు డాక్టర్ కె. లక్ష్మణ్, రఘునందన్ రావు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లి లాంటి ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంలో రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం చారిత్రక ఘట్టమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ స్టేషన్ వల్ల హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభంగా మారుతుందని చెప్పారు.
ఇప్పటి వరకు కొమురవెల్లికి వెళ్లే భక్తులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలపైనే ఆధారపడాల్సి వచ్చేది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి వచ్చే భక్తులు రాజీవ్ రహదారి వరకు చేరుకుని, అక్కడి నుంచి కొమురవెల్లికి వెళ్లేందుకు మరో వాహనం కోసం వేచి ఉండాల్సి వచ్చేది. తిరుగు ప్రయాణంలో కూడా ప్రధాన రహదారిపై గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి కొమురవెల్లికి దాదాపు 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి సుమారు 90 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. చాలామందికి రెండు, మూడు వాహనాలు మారాల్సి రావడంతో సమయం, డబ్బు రెండూ ఎక్కువగా ఖర్చయ్యేవి.
కొత్త రైల్వే స్టేషన్ ప్రారంభంతో ఈ సమస్యలకు పెద్దఎత్తున పరిష్కారం లభించనుంది. కొమురవెల్లి మాత్రమే కాకుండా చేర్యాల, మద్దూరు, ధూల్మిట్ట మండలాల ప్రజలకు కూడా రైలు ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. ప్రతిరోజూ చదువుల కోసం వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు కూడా ఈ స్టేషన్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి బస్సు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారికి ఒక్కొక్కరికి సుమారు రూ.100 నుంచి రూ.200 వరకు ఖర్చు అయ్యేది. కరీంనగర్ నుంచి వచ్చే వారికి కూడా రూ.100 నుంచి రూ.150 వరకు వ్యయం అయ్యేది. ఇకపై రైలు సేవలు అందుబాటులోకి రావడంతో ప్రయాణ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని స్థానికులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొమురవెల్లి రైల్వే స్టేషన్లో ప్రతిరోజూ నాలుగు డెమూ రైళ్లకు హాల్ట్ సౌకర్యం కల్పించారు. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య నడిచే ఈ రైళ్లు భక్తులకు ఎంతో ఉపయోగపడనున్నాయి. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే 77654 డెమూ రైలు బుధవారం మినహా ప్రతి రోజు మధ్యాహ్నం 2:38 గంటలకు కొమురవెల్లికి చేరుకుంటుంది. 77656 డెమూ రైలు గురువారం మినహా ప్రతి రోజు ఉదయం 6:45 గంటలకు స్టేషన్కు చేరుతుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే 77653 డెమూ రైలు బుధవారం మినహా ప్రతి రోజు మధ్యాహ్నం 12:44 గంటలకు వస్తుంది. 77655 డెమూ రైలు ప్రతిరోజూ రాత్రి 8:04 గంటలకు కొమురవెల్లి స్టేషన్కు చేరుకుంటుంది. మొత్తంగా ‘పెద్ది’ సినిమాలో మాదిరిగా దశాబ్దాల నిరీక్షణ తర్వాత.. కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో మల్లన్న భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు, స్థానిక ప్రజలకు కూడా రవాణా పరంగా కొత్త అవకాశాలు లభించనున్నాయి.
Read Also: ఏసీ కోచ్లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!