MagnumWings Expansion Plans: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ఎయిర్ మొబిలిటీ స్టార్టప్ మాగ్నమ్ వింగ్స్ విస్తరణ దిశగా పయణిస్తోంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు, కార్గో డ్రోన్లు, రక్షణ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక విమాన నమూనాలను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థ, భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.200 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్, ప్రస్తుతం మానవ రవాణా, సరుకు రవాణా, డిఫెన్స్ రంగాలకు ఉపయోగపడే ఆరు స్వదేశీ డ్రోన్, ఎయిర్ మొబిలిటీ మోడల్స్ ను తయారు చేసింది. ఈ నమూనాలను వచ్చే రెండేళ్లలో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి తీసుకురావాలని సంస్థ భావిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అభిరామ్ చావా వెల్లడించారు. అమెరికాలో ఏరోస్పేస్ రంగంలో చదువు పూర్తి చేసిన ఆయన.. ఎయిర్ మొబిలిటీ రంగంలో భారత్ ను ముందంజలో ఉండాలని భావించి ఈ సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థను మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయమని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం తమ స్టార్టప్ కార్యకలాపాలు మూడు వేర్వేరు ప్రదేశాల్లో కొనసాగుతున్నాయని అభిరామ్ వెల్లడించారు. అయితే, ఇకపై అన్ని విభాగాలను ఒకే చోట ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అందుకోసం 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సంస్థకు అవసరమైన నిధులను వ్యక్తిగత వనరుల ద్వారానే సమకూర్చుకున్నామని, ఇకపై ఏంజెల్ ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థల సహాయం తీసుకోవాలని చూస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో పెట్టుబడిదారులతో చర్చలు పూర్తి చేసి నిధుల సమీకరణ చేస్తామన్నారు.
విస్తరణ కోసం గుంటూరు, అనంతపురం జిల్లాలోని పలసముద్రంలో ఏర్పాటు కానున్న ఏరోస్పేస్ పార్క్ ను పరిశీలిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఆ ప్రాంతం అనుకూలంగా ఉందని తెలిపింది.
ప్రస్తుతం ఈ సంస్థలో దాదాపు 60 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విమానాలకు అవసరమైన సాఫ్ట్ వేర్, AI టెక్నాలజీ, హార్డ్ వేర్ భాగాలను సంస్థే స్వయంగా అభివృద్ధి చేస్తోంది. కేవలం మోటార్లు, ప్రొపెల్లర్లు మాత్రమే బయట నుంచి తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఎయిర్ మొబిలిటీ నమూనాలు ప్రస్తుతం కీలక పరీక్షల దశలో ఉన్నాయి. మొత్తం 10 వేల గంటల పరీక్షలు పూర్తి చేయాల్సి ఉందని సంస్థ తెలిపింది. అలాగే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందే ప్రక్రియ కొనసాగుతోందని వివరించింది.
2028 నాటికి కార్గో ఎయిర్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావాలని, ఆ తర్వాత ఏడాది ప్యాసింజర్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఎలక్ట్రిక్ ఎయిర్ మొబిలిటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మాగ్నమ్ వింగ్స్ కూడా తన తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.
Read Also: 3 గంటల్లో హైదరాబాద్- ముంబై ప్రయాణం.. బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ!