Hyderabad Airport UDF Update: సెప్టెంబర్ 1, 2026 నుంచి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త ప్రయాణికుల ఛార్జ్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు విమానాశ్రయాల ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA)కు తాజాగా ప్రతిపాదనలు సమర్పించారు. తుది ఆమోదం లభించిన తర్వాత ఈ బాదుడు మొదలుకానుంది.
ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల నుంచి బయలుదేరే సమయంలో మాత్రమే రూ.750 యూజర్ డెవలప్ మెంట్ ఫీజు (UDF) వసూలు చేస్తున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం ఈ మొత్తాన్ని రూ.580కు తగ్గించి, విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికుల నుంచి రూ.170 వసూలు చేయాలని సూచించారు. దీంతో మొత్తం రుసుము రూ.750గానే ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో కూడా ఇదే విధానం అమలు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం బయలుదేరే సమయంలో మాత్రమే రూ.1,500 వసూలు చేస్తున్నారు. కొత్త విధానంలో బయలుదేరేటప్పుడు రూ.1,150, రాక సమయంలో రూ.350 వసూలు చేయనున్నారు. మొత్తం చెల్లించాల్సిన మొత్తం మాత్రం రూ.1,500గానే ఉంటుంది.
విమానాశ్రయం విస్తరణ, కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ మార్పులు అవసరమని జీఎంఆర్ తెలిపింది. సుమారు రూ.13,975 కోట్లతో చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని వెల్లడించింది. అలాగే బయలుదేరే ప్రయాణికులపై ఉండే మొత్తం భారాన్ని తగ్గించి, రాక–పోకల మధ్య రుసుములను బ్యాలెన్స్ చేయడమే ప్రధాన ఉద్దేశమని వివరించింది.
ఈ మార్పుల వల్ల విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా పెరుగుతాయని భావించాల్సిన అవసరం లేదు. మొత్తం వసూలు చేసే రుసుములో పెద్ద మార్పు లేకపోయినా, అది ఎలా వసూలు చేస్తారనే విధానంలో మాత్రమే మార్పు ఉంటుంది. AERA నిర్ణయం, అలాగే విమానయాన సంస్థలు ఆ ఛార్జీలను టికెట్ ధరల్లో ఎలా చూపిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రయాణికులు విమానాశ్రయంలో ప్రత్యేకంగా ఈ ఛార్జీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఉన్నట్లుగానే టికెట్ బుకింగ్ సమయంలోనే UDF, ఎయిర్పోర్ట్ ఛార్జీల పేరుతో ఈ మొత్తం టికెట్ ధరలో కలిపి వసూలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.
Read Also: రెండు రోజులుగా కుండపోత వర్షాలు.. పలు రైళ్లు రద్దు.. విమానాలు ఆలస్యం!