5 Amazing Vande Bharat Train Features: భారతీయ రైల్వేలో కొత్తశకానికి నాంది పలికాయి వందేభారత్ రైళ్లు. అత్యాధునిక ప్రయాణ అనుభవాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లాయి. వేగవంతమైన ప్రయాణంతో పాటు ఆధునిక సౌకర్యాలు అందిస్తూ ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే, ఈ రైళ్లలో ఉన్న కొన్ని ప్రత్యేక ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. ఇకపై వందేభారత్ లో ప్రయాణించే ముందు తెలుసుకోవాల్సిన 5 కీలక ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రోజుల్లో చాలా మంది దగ్గర మొబైల్, ల్యాప్ టాప్ ఉంటున్నాయి. ప్రయాణ సమయంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. అందుకే, వందే భారత్ రైళ్లలో ప్రతి ప్రయాణికుడు ఈజీగా ఉపయోగించుకునేలా వ్యక్తిగత ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. దీంతో మొబైల్ ఛార్జ్ చేసుకుంటూనే ల్యాప్ టాప్ పై పని చేసుకునే అవకాశం ఉంటుంది. మరికొంత మంది సినిమాలు చూడడంతో పాటు ఇతర పనులు చేసుకుంటున్నారు. కొన్ని కోచ్ లలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఇన్ఫోటైన్ మెంట్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
వందే భారత్ ఎగ్జిక్యూటివ్ క్లాస్ లో ఉండే మరో స్పెషల్ ఫీచర్ రొటేటింగ్ సీట్లు. అవసరానికి అనుగుణంగా సీటును తిప్పుకుని కిటికీ వైపు, ఎదురుగా కూర్చోవచ్చు. అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపించే మార్గాల్లో ఈ ఫీచర్ ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది.
వాష్ రూమ్ ల పరిశుభ్రత విషయంలో కూడా వందే భారత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ రైళ్లలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఇవి వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు దుర్వాసన తగ్గించడంలో సాయపడతాయి. టచ్ ఫ్రీ ట్యాప్ లు, ఫ్లష్లు, సోప్ డిస్పెన్సర్లు ఉండటంతో పరిశుభ్రత మరింత మెరుగ్గా ఉంటుంది.
కోచ్ల మధ్య ఉండే డోర్లు పూర్తిగా ఆటోమేటిక్ గా పని చేస్తాయి. చేతులతో బలంగా నెట్టాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా లగేజీతో ప్రయాణించే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా కోచ్లలో కూల్ వెదర్ ఉండేలా ఈ డోర్లు సహాయపడతాయి.
వందే భారత్ రైళ్లను ఆధునిక సాంకేతికతతో రూపొందించారు. వేగంగా ప్రయాణించినప్పటికీ కుదుపులు తక్కువగా ఉండేలా ప్రత్యేక సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు. దీంతో ప్రయాణం మరింత సాఫీగా సాగుతుంది. కోచ్లలో శబ్దం కూడా తక్కువగా ఉండేలా డిజైన్ చేయడంతో ప్రశాంతమైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. వందే భారత్ రైళ్లు కేవలం వేగవంతమైన ప్రయాణానికే కాదు, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఎన్నో ఆధునిక ఫీచర్లతో ప్రత్యేక గుర్తింపు పొందాయి.
Read Also: వందే భారత్ క్రేజీ ఫుడ్ మెనూ.. బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఎన్ని వెరైటీలు ఉన్నాయో తెలుసా?