BharatNet Udyami: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ప్రతిష్టాత్మకంగా ‘భారత్ నెట్’ (BharatNet) విధానాన్ని బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో ప్రారంభించింది. అయితే పల్లెల్లో చివరి లబ్ధిదారుడి వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్ను చేర్చడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక వినూత్న వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో స్థానిక నివాసితులను భాగస్వామ్యం చేయడం ద్వారా ‘లాస్ట్ మైల్’ (చివరి మైలు) కనెక్టివిటీని వేగవంతం చేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
బీఎస్ఎన్ఎల్ తాజాగా సరికొత్త భాగస్వామ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. స్థానిక వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు (SHGs), చిన్న సంస్థలు, స్థానిక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPs) ఎవరైనా సరే ‘భారత్ నెట్ ఉద్యమి’ (BharatNet Udyami)గా మారేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ భాగస్వాములు గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ (FTTH) కనెక్షన్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా వచ్చే నెలవారీ ఆదాయాన్ని బీఎస్ఎన్ఎల్ తో పాటు లోకల్ భాగస్వామి 50:50 నిష్పత్తిలో పంచుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అంటే సదరు భాగస్వామి ఎంత ఎక్కువ కనెక్షన్లు అందిస్తే వారి ఆదాయం అంతలా పెరుగుతుందన్నమాట.
భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ వినియోగదారులకు నెలకు 700GB డేటాతో పాటు గరిష్టంగా 25 Mbps వేగంతో హై-స్పీడ్ కనెక్టివిటీ అందిస్తున్నారు. ఇంటర్నెట్ తో పాటు టీవీ, ఫిక్స్డ్ ఫోన్ కనెక్షన్లను ఒకే ప్యాకేజీలో అందించే ‘త్రీ-ఇన్-వన్’ సేవగా రూపుదిద్దుతున్నారు. మొత్తం 3,340 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ఇంటర్నెట్ సేవలను అందించడంతో పాటు, డిమాండ్ను బట్టి సుమారు 32,000 ఇతర గ్రామాలకు కూడా ఈ నెట్వర్క్ను విస్తరించాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.
కోల్కతా టెలిఫోన్స్, వెస్ట్ బెంగాల్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (CGM) గజాలా ఫైసల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 2,676 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ పూర్తయింది. ఇందుకోసం సుమారు 15,000 కిలోమీటర్ల కేబుల్ లైన్లు వేశారు. మిగిలిన 664 గ్రామ పంచాయతీలను కవర్ చేయడానికి మే నెలలో కొత్తగా ఎన్నికైన బెంగాల్ ప్రభుత్వంతో బీఎస్ఎన్ఎల్ ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. రాబోయే మూడేళ్లలో అదనంగా 18,000 కిలోమీటర్ల కేబుల్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇప్పటికే కనెక్ట్ అయిన ప్రాంతాలను మార్చి 2027 నాటికి అప్గ్రేడ్ చేస్తామని ఆమె వెల్లడించారు.
గతంలో బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల నుంచి సాయంత్రం 5 గంటల తర్వాత టెక్నికల్ సపోర్ట్ లభించడం లేదనే ఫిర్యాదు ప్రధానంగా ఉండేది. అయితే ఈ కొత్త విధానంతో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే కసరత్తు చేస్తున్నారు. స్థానిక ప్రైవేట్ భాగస్వాములకు కస్టమర్ కేర్, సాంకేతిక నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీనివల్ల స్థానికంగా ఉండే భాగస్వామి 24 గంటలూ అందుబాటులో ఉంటూ నెట్వర్క్ సమస్యలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది.
Also Read: రూ.4,500కే సూపర్ హెల్మెట్.. రాయల్ ఎన్ఫీల్డ్ లైట్ వింగ్ భలే ఉంది భయ్యా!
ఈ వ్యాపార అవకాశాన్ని అందుకోవాలనుకునే వారు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ‘బిజినెస్ అపర్చునిటీస్’ (Business Opportunities) విభాగం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి భాగస్వాములు ప్రాథమికంగా రూ.50,000 నుండి రూ.1 లక్ష వరకు అవసరమైన పరికరాల కోసం పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇది గ్రామీణ యువతకు స్వయం ఉపాధిని కల్పించడమే కాకుండా, పల్లెలను డిజిటల్ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Also Read: 40 ఏళ్ల తర్వాత ప్రతి పురుషుడు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన ఆరోగ్య పరీక్షలు..