Solar Railway Technology: ప్రపంచ వ్యాప్తంగా రిజెనరేటివ్ ఎనర్జీ వినియోగాన్ని పెంచేందుకు కొత్త కొత్త ఆలోచనలు అమల్లోకి వస్తున్నాయి. అందులో భాగంగానే రైల్వే ట్రాక్ లపై సోలార్ పవర్ ఉత్పత్తి చేసే సరికొత్త విధానం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రయోగాన్ని మొదట విజయవంతంగా అమలు చేసిన దేశంగా స్విట్జర్లాండ్ గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహా ప్రాజెక్టును ఇటలీ కూడా ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
స్విట్జర్లాండ్కు చెందిన సన్ వేస్ అనే స్టార్టప్ కంపెనీ గత ఏడాది వాల్ డి ట్రావర్స్ ప్రాంతంలోని బట్టెస్ గ్రామంలో రైల్వే ట్రాక్ల మధ్య ప్రత్యేకమైన సోలార్ ప్యానెల్స్ ను అమర్చింది. ప్రపంచంలోనే తొలిసారిగా నడుస్తున్న రైల్వే ట్రాక్ లపై ఈ విధంగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదట ఈ ప్రాజెక్టును మూడు సంవత్సరాల పైలట్ ప్రోగ్రామ్ గా ప్రారంభించారు. సుమారు 100 మీటర్ల పొడవైన ట్రాక్పై 48 ఫోటోవోల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేశారు. ఇవి 18 కిలోవాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు రావడంతో దీనిని పర్మినెంట్ చేయాలని భావిస్తున్నారు. ఈ వ్యవస్థ ఏడాదికి సుమారు 16,000 kWh విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. ఇది ఒక సాధారణ ఇంటికి ఏడాది మొత్తం అవసరమయ్యే విద్యుత్ కు సమానమని నిపుణులు వెల్లడించారు
సాధారణంగా సోలార్ ప్యానెల్స్ ను సూర్యరశ్మి ఎక్కువగా అందేలా అమర్చుతారు. కానీ, రైల్వే ట్రాక్ లపై అవి నిటారుగా అమర్చాల్సి రావడంతో కొంత విద్యుత్ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ, ఉత్పత్తిలో నష్టం కేవలం 10 శాతం మాత్రమే ఉంటుందని సన్ వేస్ సంస్థ అంచనా వేస్తోంది. స్విట్జర్లాండ్ లోని మొత్తం రైల్వే ట్రాక్ లపై ఈ విధానాన్ని అమలు చేస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఒక టెరావాట్ అవర్(TWh) విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇది ఆ దేశ మొత్తం విద్యుత్ అవసరాల్లో సుమారు రెండు శాతం వరకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుపై కొన్ని భద్రతా సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ప్యానెల్స్ కు పగుళ్లు రావడం, అగ్ని ప్రమాదాలు సంభవించడం, సూర్యకాంతి రిఫ్లెక్షన్ వల్ల లోకో పైలట్లకు ఇబ్బందులు కలగవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.అయితే, ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని సన్ వేస్ ప్రత్యేకంగా రిఫ్లెక్షన్ తగ్గించే సాంకేతికతతో కూడిన బలమైన ప్యానెల్స్ ను తయారు చేసింది. అలాగే ప్యానెల్స్ పనితీరును పర్యవేక్షించే సెన్సార్లు, వాటిని శుభ్రం చేసే ప్రత్యేక బ్రష్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాలేదని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్ ను జాతీయ విద్యుత్ గ్రిడ్కు పంపుతున్నారు. భవిష్యత్తులో అదే విద్యుత్ను నేరుగా రైల్వే సబ్స్టేషన్లు, రైళ్ల విద్యుత్ వ్యవస్థలకు అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
స్విట్జర్లాండ్ లో సక్సెస్ అయిన ఈ ప్రయోగం తర్వాత ఇటలీలో కూడా ఇలాంటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. దక్షిణ కొరియాలో అనుమతులు లభించగా, నెదర్లాండ్స్, చైనా, భారత్, సింగపూర్ వంటి దేశాల కంపెనీలతో కూడా సన్ వేస్ చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా రైల్వే ట్రాక్లే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Read Also: వందేభారత్ లో 5 క్రేజీ ఫీచర్లు.. నిజంగా వండర్ భయ్యా!